Komatireddy Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ ఝలక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్లనున్నారంటూ వార్తలు షికారు చేశాయి. బీజేపీ విడుదల చేసిన తొలి అభ్యర్ధుల జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఆయన పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారనేది రుజువు అయ్యింది.
నాలుగైదు రోజులుగా కాంగ్రెస్ పెద్దలతో ఆయన మంతనాలు సాగిస్తున్న విషయం తెలిసే బీజేపీ అధిష్టానం ఆయన పేరును పక్కన పెట్టి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఈ తరుణంలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరల కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయాన్ని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని పేర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ప్రజలు మార్పుకోరుకుంటున్నారని స్పష్టమవుతోందన్నారు. కేసిఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణను విముక్తి చేయాలన్నారు. తన ఆశయం అయిదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ ను భావిస్తున్నారని అన్నారు. ప్రజల ఆలోచన మేరకు వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగి.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందన్నారు. ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం గా కాంగ్రెస్ భావిస్తున్నారనీ, అందుకే తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదనీ, తెలంగాణ ప్రయోజనాల కోసమే తపన పడ్డానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
15 నెలల క్రితం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత మునుగోడుకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని భావిస్తున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డిని కేంద్ర కార్యవర్గంలోకి తీసుకుంది బీజేపీ. అయినా రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా బీజేపీకి లేదని భావనకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి చేరేందుకు మంతనాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయన చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజీనామా చేశారు. ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి .. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమయంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తొంది.
Chandrababu Arrest: జనసేనతోనే బీజేపీ పొత్తు .. డైలమాలో టీడీపీ..?