Chandrababu Arrest: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, ప్రచార పర్వంలో ముందంజలో ఉన్నాయి. జనసేన పార్టీ కూడా పోటీకి సిద్దమయ్యింది. జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండటంతో బీజేపీ నేతలు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. దాదాపు 32 స్థానాల్లో పోటీ చేయాలని తొలుత జనసేన భావించినా పొత్తులో భాగంగా అయితే 20 స్థానాలు అడుగుతున్నట్లు తెలుస్తొంది. పది నుండి 12 స్థానాలు కేటాయించడానికి బీజేపీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఇరు పార్టీల నేతల మధ్య మరో సారి చర్చలు జరిగితే ఏదో ఓ విధంగా అవగాహన కుదిరే అవకాశం ఉంది.
టీడీపీ మాత్రం ఇంత వరకూ అభ్యర్ధుల ఎంపిక జరగలేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం లేదనీ, బీజేపీకి మద్దతు ఇస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవలే 80కిపైగా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు ప్రకటించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబును తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిసి వచ్చారు. నందమూరి బాలకృష్ణ కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని చెప్పారు. ఆ తర్వాత ఆయన మళ్లీ సినిమా బిజీలో పడిపోయారు. మరల పార్టీ ఆఫీసుకు వచ్చిన దాఖలాలు లేవు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు పడలేదు.
ఏపీలో జనసేన – టీడీపీ పొత్తులో ఉన్నా తెలంగాణలో ఈ పొత్తును కొనసాగించే ఆలోచనలో రెండు పార్టీలు లేవు. బీజేపీతో కలిసి జనసేన పయనిస్తొంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తులో ఉండటంతో తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా కాస్తోకూస్తో టీడీపీ బలంగా ఉన్న స్థానాలనే జనసేనకు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీలో జనసేనతో పొత్తు ఉండటంతో చంద్రబాబు ఆ స్థానాల్లో అభ్యర్ధులను పోటీకి దింపే అవకాశం ఉండదు.
తెలంగాణలో టీడీపీ పోటీ చేయదని జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత ఒకరు ఖండించారు. పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీనిపై స్పందించలేదు కానీ టీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇంతకు ముందే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికే ఆశావహుల నుండి అప్లికేషన్ లు తీసుకున్నామన్నారు. త్వరలోనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల వివరాలను ప్రకటిస్తామన్నారు.
తమ అధినాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలులో ఉంచారన్నారు. ములాఖత్ లో ఆయనను కలిసిన తర్వాత అభ్యర్దుల విషయంపై స్పష్టత ఇస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ బలపడితే తాము ఎక్కడ దెబ్బతింటామోనని భయపడి కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీపై వదంతులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేరుగా ప్రకటన చేయకపోవడంతో అనుమానాలు కొనసాగుతున్నాయి. బీజేపీ పొత్తుతో జనసేన పోటీ చేసే స్థానాలు వెల్లడైన తర్వాతనే టీడీపీ నుండి పోటీ చేసే అభ్యర్ధులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అటు పార్టీ అధినేత చంద్రబాబు జైల్ లో ఉండటం, బీజేపీతో తలపడే పరిస్థితిలో లేకపోవడంతో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక బేషరతుగా జనసేన, బీజేపీకి మద్దతు ఇస్తుందా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.