Telangana Assembly Elections: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ నెల 27న అమిత్ షాను పవన్ కలవనున్నారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన పొత్తు గురించి ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్ ను బీజేపీ కోరిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో 20కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకం కానుంది.
పవన్ తో ఈ నెల 18న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. ఎన్నికల్లో జనసేన మద్దతు కోరారు. అయితే ఈ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ నేతలు సన్నద్దతను తెలియజేసిన విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్. అంతకు ముందు జనసేన ఏయే నియోజకవర్గాల నుండి పోటీ చేయాలనే జాబితాను కూడా జనసేన విడుదల చేసింది. అయితే పొత్తులో భాగంగా 20 స్థానాలు కేటాయించాలని అంతర్గతంగా ప్రతిపాదన పెట్టినట్లు గా తెలుస్తొంది. దీనికి మాత్రం బీజేపీ సుముఖంగా లేదనీ, పది నుండి 12 స్థానాలు పొత్తులో జనసేనకు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
అసలు వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాదిరిగానే జనసేన పోటీ చేయకుండా పూర్తిగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరాలని భావించారు. కానీ జనసేన నేతలు ముందుగా పవన్ కళ్యాణ్ ముందు ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని లేకుంటే పార్టీ క్యాడర్ దెబ్బతింటుందని, సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దీంతో జనసేన ఈ సారి ఎన్నికల్లో బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలన్న నిశ్చయంతో ఉంది. జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపుపై అమిత్ షా ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
అమిత్ షా ఎల్లుండి (అక్టోబర్ 27) తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఓ పక్క అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పర్యటించిన అమిత్ షా మరో సారి ఈ నెల 27న రానున్నారు. సూర్యాపేట లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే బీజేపీ 52 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. మరో రెండు మూడు రోజుల్లో రెండో జాబితా విడుదలకై కసరత్తు చేస్తొంది.
అయితే జనసేనతో సీట్ల పంపిణీకి సంబంధించి మరో సారి చర్చలు జరగాల్సి ఉండటంతో రెండో జాబితా ఆలస్యం అవుతోందని సమాచారం. మరో పక్క మొదటి జాబితాలో తమ పేర్లు లేని కొంత మంది ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరితో అమిత్ షా సమావేశం అవ్వనున్నారని తెలుస్తొంది. అసంతృప్తి నేతల భవిష్యత్తుకు అమిత్ షా భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అమిత్ షాతో పవన్ భేటీ అనంతరం పొత్తు సీట్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఎన్ని స్థానాలకు జనసేన ఒకే అంటుందో..!