Telangana Assembly Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో ఊపు రావడంతో ఇతర పార్టీల నుండి చేరికలు భారీగా పెరిగాయి. కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపు జోష్ ను తెలంగాణ కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. సీనియర్ నేతలు అందరూ విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపునకు కృషి చేసే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవడంతో వివిధ పార్టీల నుండి అసంతృప్తులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా బీజేపీ కీలక నేతలుగా ఉన్న మాజీ ఎంపీ జి వివేక్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఈ ఇద్దరు కీలక నేతల పేర్లు లేకపోవడంతో ఆ ఆనుమానాలకు బలం చేకూరుతోంది.
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత బీజేపీలో తనకు ఆశించిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తిగా ఉంటూ వచ్చారు. ఒకటి రెండు సార్లు ఆయన బీజేపీ పార్టీ తీరుపై కూడా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న బీజేపీ అధిష్టానం ఆయనను పిలిపించి మాట్లాడింది. ఆయనకు పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. అయినా కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తొంది. ఆ కారణంగానే ఇటీవల రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, హోంమంత్రి అమిత్ షా సభ లకు గైర్హజరు అయ్యారు.

గతంలో మునుగోడుకు చెందిన ముఖ్య నేతలతో చర్చించి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళితే ఎలా ఉంటుందన్న అభిప్రాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తొంది. మెజార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారుట. దీనిపై అప్పట్లో మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన ప్రచారాలను ఆయన ఖండించారు. తాజాగా బీజేపీ 52 మందితో మొదటి జాబితా ప్రకటించింది. కానీ అందులో మునుగోడు అభ్యర్ధిని ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచింది. దీంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తొంది. గడచిన మూడు నాలుగు రోజులుగా ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించినట్లు సమాచారం.
రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న సమాచారంతోనే బీజేపీ అధిష్టానం మొదటి జాబితాలో ఆయన పేరు ప్రకటించలేదన్న మాట కూడా వినబడుతోంది. బీజేపీలో ఆయన ఎల్బీ నగర్, మునుగోడు రెండు అసెంబ్లీ స్థానాలు అడిగారని ప్రచారం జరుగుతోంది. తాను ఎల్బీ నగర్ నుండి, తన సతీమణి మునుగోడు నుండి పోటీ చేయనున్నట్లు తెలిపారని, అయితే బీజేపీ అధిష్టానం ఈ అభ్యర్ధనను పక్కన పెట్టిందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తో మంతనాలు జరిపిన రాజగోపాల్ రెడ్డికి ఆ పార్టీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. ఎల్బీనగర్ లేదా మునుగోడు నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్న కోమటిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి ఆఫర్ ఉన్నట్లు తెలుస్తొంది. రాహుల్ గాంధీ సమక్షంలో ఈ నెల 27న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అలాగే మాజీ ఎంపీ జీ వివేక్ కూడా కాంగ్రెస్ నుండి ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తొంది. కేంద్ర మాజీ మంత్రి జి వెంకట స్వామి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ ..2009 లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ చేరి ప్రభుత్వ సలహాదారుగా పని చేశారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధుల ఓటమి కోసం ప్రయత్నించారన్న విమర్శలతో పార్టీ ఆయన్ను పక్కన పెట్టింది. దీంతో బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేదని వివేక్ బీజేపీలో చేరారు.
అయిదేళ్లుగా బీజేపీలో ఉన్న సరైన ప్రాధాన్యం లేదన్న భావనతో ఉండటంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో వివేక్ కూడా రెండు మూడో రోజుల్లో తిరిగి కాంగ్రెస్ గూటికి వెళతారంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ ఈ పరిణామాలు బీజేపీకి బిగ్ షాకింగ్ న్యూస్యే.
TDP Janasena: ముగిసిన జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ భేటీ .. తీసుకున్న నిర్ణయాలు ఇవీ