నిర్మల్ జిల్లా బాసర లోని ట్రిపుల్ ఐటీలో ఇటీవల దీపిక అనే విద్యార్ధిని మరణించగా, ఆ ఘటన మరువక ముందే తాజాగా మరో విద్యార్ధిని మృతి చెందడం తీవ్ర కలకలాన్ని రేపింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన లిఖిత (17) ఆర్జీయూకేటిలో పీయూసీ ప్రధమ సంవత్సరం చదువుతోంది. హాస్టల్ లో ఉంటున్న లిఖిత గురువారం వేకువజామున నాల్గో అంతస్తు నుండి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను భద్రతా సిబ్బంది గమనించి వెంటనే క్యాంపస్ హెల్త్ సెంటర్ లో ప్రధమ చికిత్స చేయించారు. అనంతరం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ ఆసుపత్రిలో లిఖితను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదమా.. ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గజ్వల్ కు చెందిన బుర్ర రాజు, రేణుకల పెద్ద కుమార్తె అయిన లిఖిత వారం రోజుల క్రితమే హాస్టల్ కు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇంతలోనే తమ కుమార్తె మృతి చెందిందనే వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో పక్క బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న విద్యార్ధుల వరుస మరణాలు .. ప్రభుత్వ హాత్యలే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి ఆరోపించారు. ట్రిపుల్ ఐటిలో వరుసగా విద్యార్ధులు మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధినుల మరణాలపై వెంటనే జ్యూడీషియల్ విచారణ చేపట్టాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాగా నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్న విద్యార్ధి లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ వీసీ వెంకట రమణ గురువారం పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లిఖిత మరణం ప్రమాదవశాత్తు జరిగిందనీ, విద్యార్ధిని మృతి దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్ధులు మనోధైర్యం కోల్పోవద్దని భరోసా కల్పించారు.
అయితే అక్కడకు వీసీ రావడంతో ఆసుపత్రి ఆవరణలో ఉద్రికత్త నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. సమాధానం చెప్పకుండా వీసీ వెళ్తున్నారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ వాహనాన్ని వారు అడ్డగించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరో పక్క ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటన బాధాకరమని అన్నారు. విద్యార్ధిని దీపిక మృతిపై కమిటీ వేశామనీ, దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని తెలిపారు. పూర్తి సమాచారం లేదనీ, పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మీడియా సమావేశంలో అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు.
లోకేష్ పై ఆర్జీవీ సెటైర్ .. ఆస్కార్ ఇవ్వాల్సిందే..