కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు చెందిన మరో బీజేపీ నేతకు కీలక పదవి ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా ఉండగా, తాజాగా నల్లు ఇంద్రసేనారెడ్డి గవర్నర్ గా నియమితులైయ్యారు. త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనా రెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఇంద్రసేనారెడ్డి గతంలో మలక్ పేట నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ చైర్మన్ గా 2022 లో నియమితులైయ్యారు. త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి నియమితులు కాగా, కొత్తగా ఒడిశాకు గవర్నర్ గా ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ నియమితులైయ్యారు. రఘుబర్ దాస్ 2014 నుండి 2019 వరకూ జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
హైదరాబాద్ కు చెందిన సీనియర్ బీజేపీ నేత బండారు దత్తాత్రేయ 2019 లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైయ్యారు. ఆ తర్వాత 2021లో హర్యానా 18వ గవర్నర్ గా నియమితులైయ్యారు. ఒకే రాష్ట్రం నుండి ఇద్దరు నేతలకు గవర్నర్ పదవులు లభించాయి. ఏపీ నుండి కంభంపాటి హరిబాబు మిజోరం గవర్నర్ గా కొనసాగుతున్నారు. హరిబాబు 2021 జూన్ నుండి గవర్నర్ గా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి ముగ్గురు నేతలకు గవర్నర్ పదవులు లభించడం విశేషం.
AP High Court: ఏపీ హైకోర్టులో రామోజీ, శైలజాకిరణ్ లకు ఊరట