ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ థాంక్స్ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సహజంగా అధికార పక్షాన్ని విమర్శించడానికి ప్రతిపక్ష పార్టీలు పొరుగు రాష్ట్రాల్లో పరిపాలన తీరును మెచ్చుకుంటూ ఉంటారు. ఏపీ, తెలంగాణ రెండు విభజిత తెలుగు రాష్ట్రాలు కావడంతో ప్రజలు, రాజకీయ నేతలు పలు అంశాలను పోలుస్తూ ఉంటారు. కేసిఆర్, జగన్ పాలనా తీరును బేరీజు వేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఏపీలో భూములు ధరలు పడిపోయి తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగి ధరలు విపరీతంగా పెరగడంపై ఏపీ విపక్ష నేత చంద్రబాబు ఓ సందర్భంలో ఆంధ్రలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో వంద ఎకరాలు కొనుక్కునవే పరిస్థితి గతంలో ఉండగా, ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనవచ్చని అన్నారు. అంతే కాకుండా తెలంగాణలోని ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టే అక్కడ వ్యవసాయ మీటర్లు పెట్టనివ్వలేదని, కేంద్ర మెడ మీద కత్తి పెట్టినా కేసిఆర్ ప్రభుత్వం ఒప్పుకోలేదని అన్నారు.
ఏపీ సీఎం జగన్ కూడా దిశ సంఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుకు ఏపీ శాసనసభలో ఐ సెల్యూట్ కేసిఆర్ అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పల్లె, పట్టణ ప్రగతిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో అక్కడి విపక్ష నేతలపై విమర్శలు సంధించే క్రమంలో చంద్రబాబు, జగన్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్ర సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబుకు అర్ధం అవుతుందని కానీ ఇక్కడి భట్టి, రఘునందనరావు లాంటి వాళ్లకు మాత్రం అర్ధం కావడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా జగన్, చంద్రబాబుకు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు మంత్రి కేటిఆర్.
టీటీడీకి కొత్త చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి.. సీఎం జగన్ అనూహ్య ఎంపిక