ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కొత్త చైర్మన్ గా భూమన కరుణాక్ రెడ్డి ఎంపికైయ్యారు. టీటీడీ ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ నెల 12వ తేదీతో ముగియనున్నది. మరో పది నెలల్లో ఎన్నికలు ఉండటంతో సీనియర్ నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీకే వినియోగించుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండు టర్మ్ లు టీటీడీ చైర్మన్ గా సేవలు అందించారు. టీటీడీ చైర్మన్ పదవిని వైవీ సుబ్బారెడ్డి తొలుత అయిష్టంగానే ఒప్పుకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో రెండో సారి కూడా కొనసాగారు.
టీటీడీ చైర్మన్ పదవి రేసులో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిల తదితరుల పేర్లు వినబడ్డాయి. అయితే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుండి బోర్డు సభ్యుడుగా ఉన్నారు. తుడా చైర్మన్ హోదాలో టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడుగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదనీ, తన స్థానంలో తన కుమారుడు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నాడని భాస్కరరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రతిపాదనను సీఎం జగన్ కూడా ఆమోదించారు. ఈ క్రమంలోనే అన్నమయ్య, తిరుపతి జిల్లా పార్టీ బాధ్యతలను కూడా చెవిరెడ్డికి అప్పగించారు సీఎం జగన్.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఇటీవలే ఓ కీలక పదవి లభించింది. శాసనసభ సభా హక్కుల కమిటీ చైర్మన్ గా నియమితులైయ్యారు భూమన. టీటీడీ నూతన చైర్మన్ ఎంపికకు ముందే ఆయనకు ఆ పదవి ఇవ్వడంతో ఈ రేసు నుండి తొలగిపోయినట్లు అందరూ అనుకున్నారు. మరో పక్క వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సారి కూడా టీటీడీ చైర్మన్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తే ప్రతిపక్షాల నుండి విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉందనీ. ఈ సారి బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకుడు, వైసీపీలో అత్యంత కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరును సీఎం జగన్ పరిశీలించారని ప్రచారం జరిగింది. టీడీపీ హయాంలో బీసీ (యాదవ) సామాజికవర్గానికి చెందిన నేత పుట్టా సుధాకర్ యాదవ్ కు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఇప్పుడు జగన్మోహనరెడ్డి కూడా అదే ఫార్మలాలో యాదవ (బీసీ) సామాజికవర్గానికి చెందిన కీలక నేత జంగా కృష్ణమూర్తికి అవకాశం కల్పిస్తారని అనుకున్నారు.
కానీ అనూహ్యంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్ ఎంపిక చేశారు. టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూనన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా నియమితులు కావడం ఇది రెండో సారి. గతంలో వైఎస్ఆర్ హయాంలో 2006 నుంమడి 2008 వరకూ టీటీడీ చైర్మన్ గా పని చేశారు. తాజా నియామకంతో రెండేళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 2019 లో బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుతం చైర్మన్ తో పాటు టీటీడీలో 35 మంది పాలకవర్గ సభ్యులు ఉన్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. చిన్న తనం నుండి అభ్యుదయ భావాలతో పెరిగి ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లారు. జైలులో వైఎస్ రాజారెడ్డికి పరిచయమైన భూమన కరుణాకర్ రెడ్డి అప్పటి నుండి వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ దివంగత సీఎం వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాక ముందు చేపట్టిన పాదయాత్రను ఆయనే దగ్గర ఉండి పర్యవేక్షించారు. 2004 నుండి 2006 వరకూ తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ (తుడా) చైర్మన్ గా, 2006 నుండి 2008 వరకూ టీటీడీ చైర్మన్ గా భూమన భాద్యతలు నిర్వహించారు. 2009 జరిగిన ఎన్నికల్లో తిరుపతి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి నాడు ప్రజా రాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేతిలో పరాజయం పాలైయ్యారు. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరి 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరుపతి నుండి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. 2019 ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 నుండి టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులైయ్యారు.
రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత .. ఆర్టీసీ కార్మిక నేతలతో గవర్నర్ చర్చలు