TSPSC Group 2 Preparation Strategy: టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే గ్రూప్-2 పరీక్ష కోసం అయిదు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే జరగాల్సిన ఈ పరీక్షను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థుల కోరిక మేరకు పోస్ట్పోన్ చేసింది. గ్రూప్-2లో ఉద్యోగం సాధించేందుకు లక్షల మంది తమ కలల కొలువు దక్కించుకునేందుకు ఎంతో కాలంగా అకుంఠిత దీక్షతో ప్రిపరేషన్ సాగిస్తున్నారు. ఎన్ని నెలలు కృషి చేసినా.. ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు చదివినా.. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు రివిజన్తో సక్సెస్ సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్ష కోసం నెల రోజులపాటు పాటించాల్సిన నియమాలు, స్ట్రాటజీలను తెలుసుకోండి.
గ్రూప్-2 పరీక్షల తేదీలు..
మొత్తం నాలుగు పేపర్లుగా ఉండే గ్రూప్-2 పరీక్షలను టీఎస్పీఎస్సీ నవంబర్ 2, 3వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంటే.. ఇప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల సమయం అందుబాటులో ఉంది. ఎంతో విలువైన ఈ సమయంలో ముఖ్యాంశాల రివిజన్ మొదలు పరీక్ష రోజున అనుసరించాల్సిన వ్యూహంపై అభ్యర్థులు క్లారిటీ ఉండాల్సి ఉంటుంది.
ప్రణాళిక ప్రకారం చదువు.. రివిజన్..
ఇప్పటికే ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకుని పరీక్షకు సన్నద్ధమవుతుంటారు. దాదాపు అన్ని పుస్తకాలను చదివి ఉంటారు. అయితే ప్రస్తుతం తక్కువ సమయం ఉండటం వల్ల రివిజన్పై ఫోకస్ పెట్టాలి. అన్ని పుస్తకాలు రివిజన్ చేసినట్లు అయితే చదివిన ప్రతి విషయం గుర్తుండే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆయా అంశాలకు నిర్దిష్టంగా సమయం కేటాయించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. అయితే ఈ సమయంలో కొత్త పుస్తకాల జోలికి వెళ్లడం సరికాదు. పాత పుస్తకాలను ఫాలొ అవుతూ.. కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలి. అలాగే చదివిన అంశాలను మళ్లీ మళ్లీ రివిజన్ చేస్తుండాలి. చాలా వరకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి..
కాంపిటేటీవ్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మొదటి నుంచే ఆయా సబ్జెక్టుల్లోని ముఖ్యమైన అంశాలతో సొంతంగా నోట్స్ రాసుకుంటారు. దీన్ని షార్ట్ అండ్ సింపుల్గా రాసుకోవాలి. ఇంపార్టెంట్ వ్యక్తి, ప్రాంతం, సంవత్సరం ఇలా ఏదైనా ఉంటే రాసుకోవాలి. ఎప్పుడైతే ఈ నోట్స్ను రివిజన్ చేస్తారో అప్పుడు పుస్తకంలో చదివిన అంశాలు గుర్తుకు రావాలి. మతాలు, సామాజిక వర్గాలు, చరిత్ర, గిరిజన సంప్రదాయాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు లోతైన పరిశోధన చేయాలి. అప్పుడు ఆ విషయంపై పూర్తి అవగాహన వస్తుంది.
అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ..
ప్రస్తుత సమయంలో ఆయా పేపర్లలో ఉన్న కామన్ టాపిక్స్ను ఏకకాలంలో చదివేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. చదివేటప్పుడు ఆయా సబ్జెక్టుల్లోని ఉమ్మడి అంశాలను గుర్తించాలి. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా సమయం ఆదా అవ్వడంతో పాటు రివిజన్ కూడా వేగంగా అవుతుంది. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, భారత రాజ్యాంగం, పరిపాలన, అసెంబ్లీ, చట్టాలు, హక్కులు, ఎకానమి, రాజకీయం ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. అలాగే ప్రతి రోజు 8 నుంచి 10 గంటల పాటు ప్రిపరేషన్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
ప్రభుత్వ పథకాలు, విధానాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, పథకాలపై అభ్యర్థులకు పూర్తి అవగాహన ఉండాలి. రాష్ట్ర స్థాయిలో ఆర్థిక, సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు రూపొందించిన విధానాలపై దృష్టి పెట్టాలి. వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, గిరిజనులు, వికలాంగుల సంక్షేమం, కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉన్న పథకాల గురించి తెలుసుకోవాలి. ఏ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పథకాలు వచ్చాయి. ప్రస్తుతం ఎలాంటి పథకాలు అమలు అవుతున్నాయి. ఇవి ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి. వీటిపై ఏమైనా వ్యతిరేకత ఉందా? తదితర విషయాలపై అవగాహన ఉండాలి.
వీటిపై స్పెషల్ ఫోకస్..
గ్రూప్-2 అభ్యర్థులు పేపర్-4పై ప్రత్యేకగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గరిష్టంగా స్కోర్ చేసేందుకు అవకాశమున్న పేపర్ ఇది. తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఏర్పాటు, ఆవిర్భావం, ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ-నాన్ ముల్కీ, రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ బిల్లు అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. అలాగే తెలంగాణ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీపై మంచి పట్టు ఉండాలి. జనాభా, నదులు, పంటలు, భౌగోళిక స్వరూపం తదితర విషయాలు తెలిసి ఉండాలి.
పరీక్షకు ముందు రోజు ఇలా చేయండి..
పరీక్షకు ఒక రోజు ముందు అభ్యర్థులు సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంటే మరుసతి రోజు పరీక్ష సెంటర్కు వెళ్లేందుకు అవసరమైన హాల్ టికెట్, పెన్నులను సిద్ధం చేసుకోవాలి. పోటీ పరీక్షల నేపథ్యంలో ఎక్కువగా చదవాలనే టెన్షన్ ఉండటం కామన్. కానీ అతిగా చదవడం వల్ల మానసిక ఒత్తిడి, అలసటకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలి. రోజూ వ్యాయామం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాక్టీస్ బిట్స్ చేస్తుండాలి.