తెలంగాణలో రాజకీయాలు, మునుగోడు ఉప ఎన్నికలపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదని, ముందస్తు ఎన్నికలు తెలంగాణలో రావని అన్నారు. అంత దమ్ము కేసిఆర్ కు లేదని అన్నారు. కేసిఆర్ తన కుమార్తెను లిక్కర్ స్కామ్ నుండి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేంత సీన్ లేదని అన్నారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితిగా షర్మిల అభివర్ణించారు. దేశంలో అతి పెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిందని ఆరోపించారు. కమీషన్ల కోసమే కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేశారని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్, బీజేపీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు షర్మిల. కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ పై విమర్శలకు మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నారు. దేశానికి కాపలా కుక్కలమన్న కేంద్ర మంత్రులు ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. అవినీతి జరిగిందని చెప్పినా ఎందుకు దర్యాప్తు జరపడం లేదని ప్రశ్నించారు.
దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నిక మునుగోడులో జరుగుతోందని షర్మిల అన్నారు. మునుగోడులో జరుగుతున్నది వీధి కుక్కల కొట్లాటగా అభివర్ణించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరగడం లేదని, ఈ ఎన్నిక అధికార పార్టీకి, ఒక రాజకీయ వేత్త అహంకారికి మధ్య జరుగుతోందని అందుకే వైఎస్ఆర్ టీపీ పోటీ చేయడం లేదని చెప్పారు. ఎలాగైనా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని జోస్యం చెప్పారు. మునుగోడులో వంద కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుండి వైఎస్ఆర్ టీపీ చేస్తుందని, తాను పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తెలిపారు. పాదయాత్ర తర్వాత నియోజకవర్గంలో ఫోకస్ పెడతానని చెప్పారు.
రాజకీయాల్లో తనకు అన్న జగన్ రోల్ మోడల్ కాదనీ, తండ్రి రాజశేఖరరెడ్డి రోల్ మోడల్ అని షర్మిల అన్నారు. మునుగోడును మంత్రి కేటిఆర్ దత్తత తీసుకుంటానని చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అది ఏమైనా పక్క రాష్ట్రంలో ఉందా అని ప్రశ్నించారు షర్మిల. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో తెలంగాణలో వరిగేది ఏమీ లేదని అన్నారు. రాహుల్ గాంధీ పై ప్రజల్లో నమ్మకం తగ్గిపోయిందని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే పార్టీ పెట్టిన ఏడాది లోపే ప్రజల అభిమానం పొందిన వైఎస్ఆర్ టీపీ బెటరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన పడవ కాకపోతే ఏమనాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి ఓట్లు వేయమని చెబుతుంటారు. అటువంటి వాళ్లు ఆ పార్టీలో ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను కోవర్ట్ రెడ్డి బ్రదర్స్ గా ఆమె సంభోదించారు.