ఏపి మూడు రాజధానుల అంశంలో బీజేపీ నేతలు ఇంకా ద్వంద వైఖరినే కొనసాగిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్నది తమ పార్టీ స్టాండ్ అంటూనే, రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదు అని ఒకరు, ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని మరొకరు స్పష్టం చేస్తుండటం ప్రజల అయోమయానికి, ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఏమన్నారు..
ఏపీ రాజధాని అంశం ముమ్మాటికీ కేంద్రం పరిధిలోనిదే. అమరావతిని రాజధానిగా గతంలోనే కేంద్రం గుర్తించింది. ఆర్టికల్ 254 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు కేంద్ర చట్టాలకు విరుద్ధంగా ఉంటే వాటిని రాష్ట్రపతి ఆమోదించాలి. ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉన్న బిల్లులు కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వీటిని గవర్నర్ కేంద్రానికి నివేదించాలే తప్ప ఆమోదిస్తే రాజ్యాంగ విరుద్ధమవుతుంది. అమరావతి నుంచి రాజధాని అంగుళం కదలదు.
బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమన్నారంటే..
రాజధాని వికేంద్రీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల విషయంలోనే కలుగ జేసుకుంటుంది. దేశంలో అనేక రాష్ర్టాలలో కొత్త రాజధానులు ఏర్పాటు చేస్తున్నా.. కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదు.
గతంలో నాటి సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తేనే అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చారు. అమరావతిపై చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కొత్తగా మూడు రాజధానుల విధానం చేపడితే కేంద్రం జోక్యం చేసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అన్యాయం జరగకుండా పోరాడతాం.
బీజేపీ జాతీయ పార్టీ. మొదటి నుండి ఆ పార్టీలో భిన్న నాయకులు, భిన్న మనస్తత్వాలు, భిన్న వాదనలు ఉంటూనే ఉంటాయి. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిని మార్చినా అదే తంతు కొనసాగుతుంది. రాజధాని విషయంలో అదే గందరగోళం కొనసాగిస్తున్నారు. సుజనా చౌదరి మాట చెల్లుతుందా? చెల్లదా?, సోము వీర్రాజు మాట చెల్లుబాటు అవుతుందా? ఇద్దరిలో ఏది బీజేపీ వాదన?, ఒకరి వాదన కరెక్ట్ అనుకున్నప్పుడు మరొకరిని నోరు మూయించే పరిస్థితి బీజేపీలో లేదా? పార్టీ పరంగా మాట్లాడుతున్నారా? వ్యక్తిగతం గా మాట్లాడుతున్నారా? అనేది ముందుగానే బీజేపీ నిర్ధారించుకొని నాయకుల చేత మాట్లాడించాలి. లేకపోతే ఇటువంటి గందరగోళ పరిస్థితే వస్తుంది. రాజధాని విషయంలో మొదటి నుంచి బీజేపీ వైఖరి ఇలాగే ఉంది.