సార్వత్రిక ఎన్నికల ముందు నుండి ఇటీవల కాలం వరకూ ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ మంచి సంబంధాలనే కొనసాగించారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కు కెసిఆర్ అన్ని విధాలుగా తోడ్పాటు అందించారనీ ఇద్దరి మధ్య గురు శిష్యుల బందం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య జల జగడంతో బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లింది. ఒక పక్క నీటి విషయం, మరో పక్క ఆర్ టీ సీ బస్సుల విషయం రెండు ఇప్పుడు రాష్ట్రాల మధ్య ప్రధాన సమస్యగా ఉంది.
అపెక్స్ కౌన్సిల్ లో వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్న తెలుగు రాష్ట్రాలు
ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశంలో నీటి సమస్యపై ఎవరి వాదనలు వారు వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపిపై తెలంగాణ సీఎం కెసిఆర్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఏపి ప్రభుత్వం కావాలనే కయ్యం పెట్టుకోవడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు కేసిఆర్. అపెక్స్ కమిటీలో సమర్థవంతంగా వాదనలు వినిపించేందుకు గానూ ఉన్నతాధికారులతో కెసిఆర్ సమావేశం కూడా నిర్వహించారు. కెసిఆర్ వ్యాఖ్యలపై ఏపి సీఎం వైఎస్ జగన్ స్పందించలేదు. అపెక్స్ కమిటీలోనే తెలంగాణకు సరైన జవాబు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు అంటున్నారు. కృష్ణా, గోదావరి నీటి పంపకాల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి వాదనలు వినిపించడానికి సన్నద్దం అవుతున్నాయి. ఈ సమావేశం వాడివేడిగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తేలని ఆర్ టీ సీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ పంచాయతీ
కరోనా లాక్ డౌన్ సడలింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అంతరాష్ట్ర ప్రజా రవాణాకు అనుమతిులు ఇచ్చి రెండు నెలలు అవుతున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్ టి సి బస్సు సర్వీసుల పునరుద్ధరణ జరగలేదు. ఇది ప్రైవేటు ఆపరేటర్ లకు వరంగా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య కిలో మీటర్ల పంచాయతీ, బస్సు సర్వీసుల కుదింపుపై అవగాహన ఒప్పందాలలో ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల ఆర్ టీ సీ ఉన్నతాధికారులు పలు మార్లు సమావేశాలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రధానంగా విజయవాడ – హైదరాబాదు మధ్య ఆర్ టి సి బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రవేటు ఆపరేటర్లు భారీగా టికెట్ ధరలు పెంచేశారు. దీంతో ప్రయాణీకులపై తీవ్రమైన భారం పడుతోంది. విజయవాడ – హైదరాబాదు మధ్య 800 నుండి వెయ్యి రూపాయల వరకూ ప్రైవేటు ఆపరేటర్లు వసూలు చేస్తున్నారు. ఈ రెండు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రులు ఏ విధంగా పరిష్కారమార్గం చూపుతారో చూడాలి.