దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో ఆందోళన రేకెత్తిస్తోంది. రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తూ పరిస్థితిని ప్రమాదకరంగా మార్చేస్తోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14లక్షలకు చేరువలో ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది.
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48,661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 13,85,552 కు చేరుకుంది. 705 కోవిడ్ మరణాలు సంభవించాయి. మొత్తంగా దేశంలో 32,063 కోవిడ్ మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తన నివేదికలో తెలిపింది. మహారాష్ట్రలో 3లక్షలు, తమిళనాడులో 2లక్షలు కేసులు దాటాయి. దీంతో కోవిడ్ కేసుల్లో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో, మరణాల్లో 6వ స్థానంలో ఉంది.
ఏపీలో కరోనా తీవ్రత పెరిగింది. వారం రోజులుగా కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. నిన్నటికి 7,813 పాజిటివ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 52 మంది మరణించగా మొత్తంగా మరణాల సంఖ్య 985కు చేరుకుంది. గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది.