ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు నుండి అది తమ పరిధిలో లేని విషయం అని క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ అంశంపై టిడిపి నాయకులు మాత్రం ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించే రీతిలో కామెంట్లు చేయడం, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి విషయంలోకి వెళ్తే ఏపీ రాజధానిగా అమరావతి నే చంద్రబాబు సెలెక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి అనేది ఒక చోట జరిగితే ప్రమాదం అని రాష్ట్ర వ్యాప్తంగా జరిగేలా రాజధాని వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే మొదటి నుండి మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు పార్టీ నాయకులు మరియు రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలు అమరావతి నే ఏకైక రాజధానిగా ఉంచాలని దీక్షలు ఆందోళనలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఇదిలా ఉండగా చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు రాజధాని అంశం కేంద్ర పరిధి లోనిది రాజధాని మార్చడం కుదరదు అనే రీతిలో వ్యాఖ్యలు చేయటంతో విమర్శలు భారీగా వస్తున్నాయి. ఆయన చెప్పినట్టుగా అమరావతి కేంద్ర పరిధిలో అంశం అయితే అమరావతిని ఏపీ రాజధానిగా ఎవరు గుర్తించారో ఆయన చెప్పగలరా అని మేధావుల నుండి ప్రశ్నలు వస్తున్నాయి. అమరావతి అనేది పూర్తిగా చంద్రబాబు ఇష్టంతోనే జరిగింది. సిఆర్డిఎ చట్టం ద్వారా రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించడంతో పాటు రాజధాని పరిధిలో నవ నగరాల పేరిట డిజైన్ రూపకల్పన అప్పట్లో చంద్రబాబు చేసిన టైములో పక్కనే ఉన్న యనమల ఇలా మాట్లాడటం చాలా దారుణం అని మేధావులు చెప్పుకొస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర రాజధాని ఎంపిక అనే విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
తాజాగా ఏపీ రాజధాని విషయంలో గందరగోళానికి గురి చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లలో మేటర్ లేదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంశం పరిధిలో ఉండబట్టే కర్ణాటక రాష్ట్రంలో రెండవ రాజధాని అదే రీతిలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా మరో రాజధానికి అక్కడ ఉన్న ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఆపటం కేంద్రం వల్ల కూడా కాదని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంమీద చూస్తే మూడు రాజధానులు విషయంలో జగన్ కి చాలా వరకు ఎదురు లేదని…రాజకీయ కారణాల వల్ల ఏమైనా రాజధాని ఆపగల రేమో కానీ రాజ్యాంగపరంగా మాత్రం రాజధానిని అడ్డుకోవటం అసంభవమని పేర్కొంటున్నారు.
దీంతో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయం త్వరలో రాష్ట్రంలో అమలు అయ్యే అవకాశం ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే మాత్రం ఏపీకి మూడు రాజధానులు వస్తే కచ్చితంగా ఇది చంద్రబాబుకు చేదు వార్త అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమరావతి ప్రాంతం లోనే కాక మిగతా ప్రాంతాలలో జగన్ రాజధాని తీసుకురావటం తో ఆ ప్రాంతాలలో వైసిపికి ఆదరణ మరింతగా పెరిగే అవకాశం ఉందని, అలాగే ఇప్పటి వరకు అడ్డుపడిన చంద్రబాబుకి కొంత నెగిటివ్ ఆ ప్రాంతాలలో ఏర్పడే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.