విద్యా విధానాన్ని మార్చేస్తారట.. తరగతుల అంతరాన్ని తగ్గించేస్తారుట.. 10, ఇంటర్, డిగ్రీ సంవత్సరాలను కాస్తా 5+3+3+4 అంటూ విభజించేస్తారట.. నైపుణ్యాలను పెంచే చేస్తారట.. ఆరో తరగతి నుండే కోడింగ్ అని ప్రొగ్రమింగ్ అని విద్యార్థులకు నేర్పించేస్తారట.. మొత్తానికి దేశంలో విద్యను ఉద్దరించేస్తారుట. ఇది మోడీ గారి ప్రభుత్వం కేంద్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం. మంచిదే. శభాష్. చప్పట్లు కొట్టాల్సిందే. సెల్యూట్ చేయాల్సిందే. మనం అందరమూ చేద్దాం. ఈ విధానాన్ని ఆహ్వానిద్దాం. మరి చదువుకున్న వాళ్ళ సంగతి ఏంటి? పట్టా అందుకున్న వాళ్ళ సంగతి ఏంటి? చదువు పూర్తి చేసుకుని పట్టా చేతపట్టుకుని రోడ్డు ఎక్కుతున్న వారి సంగతేంటి?మోడీ గారు..ఏమైనా ఆలోచిస్తున్నారా. మేకిన్ ఇండియా ఎంత వరకు వచ్చింది? ముద్ర రుణాలు ఏ పరిస్థితి వరకు తీసుకొచ్చారు? నైపుణ్యాభివృద్ధి ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఇవన్నీ ఏమైయ్యాయి?. విద్యా విధానం మార్పుతో పాటు ఉపాధి అవకాశాలు పెంచితేనే దాని ఫలితం అందేది. మొక్క నాటిన తరువాత నీళ్లు పోసి పూర్తి స్థాయి సంరక్షణ బాధ్యతలు చేపడితేనే ఫలాలు వస్తాయి. ఫలితం అందుతుంది. విత్తనం వేసిన తర్వాత అదే పెరుగుతుంది లే అని వదిలేస్తే..కోట్ల లో నిరుద్యోగులు రోడ్డు పై పరుగులు పెడుతున్నట్లే పరిస్థితి మారుతుంది. మీకేమైనా అర్థమవుతుందా?.
కేంద్రం తీసుకు వస్తున్న తాజా మార్పులను గమనిస్తే…
* నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్య తప్పనిసరి.
* విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించాలనేది మరియు 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది లక్ష్యo
* బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం.
* ప్రాథమిక విద్యకు దేశ వ్యాప్తంగా ఒకే కరికులమ్ అమలు చేయనున్నారు. కొత్త విధానంలో ఇంటర్ విద్యను రద్దు చేసి.. డిగ్రీ విద్యను నాలుగేళ్లుగా మార్పు చేశారు.
* ఆరో తరగతి నుంచే వొకేషన్ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం చేయనున్నారు.
* నూతన విద్యా విధానము 2020 పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత నుండి అమలు లోకి వస్తుంది.
* ఉపాధ్యాయులను నాన్ అకాడెమిక్ ఫంక్షన్ల నుండి తొలగిస్తారు. ఎన్నికల విధులు మాత్రమే విధించబడుతుంది.
ఉపాధ్యాయులను బీఎల్ఒ డ్యూటీ నుండి తొలగిస్తారు.
* పాఠశాలల్లో ఎస్ఎంసి / ఎస్డిఎంసితో పాటు ఎస్సిఎంసి అంటే స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తారు.
* కేంద్ర పాఠశాలల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తారు. ఇలా మరి కొన్ని అంశాలతో నూతన విద్యా విధానంలో మార్పులు ప్రతిపాదించారు.
తెలుగు రాష్ట్రాల పరిస్థితికి ఒక సారి మాట్లాడుకుందాం
పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా విద్యార్థులను తయారు చేయడమే ఇప్పుడు విద్యా విధానంలో మార్పులు అనుకుందాం. సరే.. పట్టభద్రులు అవుతారు. పట్టాలు పట్టుకు వస్తారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకుంటారు. కానీ నిలదొక్కుకోవడం ఎలా. ఉపాధి తెచ్చుకోవడం ఎలా. నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లేలా జీవితాన్ని మార్చుకొనేది ఎలా. పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ బిడ్డలను చదివించుకొని బతుకుబండిని మార్చుకునేలాఎలా. ఇదే ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితికే వస్తే విద్యా విధానాలు మార్పులకు సంబంధం లేకుండానే గడిచిన పదిహేనేళ్ల డేటా తీసుకుంటే సంవత్సరానికి రెండున్నర నుంచి మూడు లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని రోడ్లపైకి వస్తున్నారు. వీరిలో తమ చదువు, తమ పరిజ్ఞానానికి సంబంధించి ఉద్యోగాలు ఎతుక్కుంటున్నవాళ్ళు కేవలం మూడు శాతం మందే ఉన్నారు. ఏమి చేతకాక సబ్జెక్ట్ రాక సంబంధం లేని పనులు చేస్తున్న వాళ్ళు, కూలీలుగా మారిన వాళ్ళు 50 శాతానికి పైగా ఉన్నారు. 15 ఏళ్ల నుంచి దేశంలో ఇంజనీరింగ్ విద్య సాంకేతిక విద్య చిత్తు కాగితంగా మారింది. ఈ పరిస్థితిని తీసుకు రావడం కూడా నాటి విద్యా విధానాల మార్పులతో పాటు విద్య ను అందించడానికి అందించిన పథకాలే కారణం. విద్యా విధానంలో మార్పులు తప్పు కాదు. కానీ దానికి తగ్గట్టు ఉపాధి అవకాశాలు పెంచడం, యువత పట్టా అందుకున్న వెంటనే వారి కాళ్లపై వారు నిలబడేలా లేదా ఉద్యోగం సంపాదించేలా చేయడమే విద్య విధానాలల మార్పుల ప్రధాన లక్ష్యం కావాలి. లక్ష్యంతో పాటు నెరవేర్చుకొనే శక్తి యుక్తులు ఉండాలి. ఇప్పుడు దేశంలో కావలసిన మార్పులు ఇవే.
నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లు పూర్తి పాఠం కొరకు కింద లింక్ ను క్లిక్ చేయండి