గల్లా జయదేవ్….టీడీపీ తరఫున ఏపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరు. లోక్సభ వేదికగా `మిస్టర్ మోడీ` అంటూ వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. అలాంటి నాయకుడికి ఏమైందో ఏమో కానీ..
ఇప్పుడు అమరావతిపై రాజకీయ రచ్చ జరుగుతున్న సమయంలో పత్తా లేకుండా పోయారు. గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ తన ఇలాకాలో జరుగుతున్న ఆందోళనలపై కిమ్మనకుండా ఉండటమే పెద్ద వార్త అయితే, ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సంచలనంగా మారింది.
అంత బిజీగా ఉన్నారా ఎంపీ గారు?
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన అమరావతిలో రాజధాని నిర్మాణాలు, డిజైన్ల రూపకల్పన, విదేశీ పర్యటనల్లో గల్లా జయదేవ్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినా.. క్రాస్ ఓటింగ్ పుణ్యమా అని గట్టెక్కేశారు. అయితే, కొద్దికాలంగా ఆయన ఆచూకి లభించడం లేదని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య విమర్శలు- ప్రతివిమర్శలు, రాజీనామాలు, డెడ్లైన్లతో రాజకీయం హోరెత్తుతున్నా ఎంపీ గారి జాడ లేదంటున్నారు.
గల్లా జయదేవ్..ఈ మాత్రం కూడా చేయలేరా?
రాజధాని అమరావతి ప్రాంతం గల్లా జయదేవ్ లోక్సభ పరిధిలోకే వస్తుంది. అయినా గల్లా జయదేవ్ ఒక్క మాట మాట్లాడింది లేదు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదని అంటున్నారు. కనీసం ఫోన్కు కూడా ఎంపీ జయదేవ్ అందుబాటులో లేరని అమరావతి ప్రాంత టీడీపీ నేతలే విరుచుకుపడే పరిస్థితి ఉంది. ఒకవేళ కరోనా వల్ల ఆయన జనాల మధ్యకు రావడం లేదని అనుకున్నా.. భౌతికదూరం పాటిస్తూ స్థానికులు, స్థానిక నేతలు ఆందోళనలు చేయడం లేదా అని నిలదీస్తున్నారట. రోజూ రాజధాని గ్రామాలకు రాలేకపోయినా… కనీసం గుంటూరులోని కార్యాలయంలో అందుబాటులో ఉన్నా.. ఉద్యమం చేస్తున్నవారికి అండగా ఉన్నారన్న నమ్మకం కలుగుతుందని టీడీపీ నేతలే అనుకుంటున్నారు.
జయదేవ్ జంపింగ్ ఖాయమైందట?!
అయితే, అమరావతి గట్టుపై కనిపించడమే మానేసిన గల్లా జయదేవ్ బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్ వస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం గల్లా జయదేవ్ కంపెనీకి చేసిన భూ కేటాయింపులను రద్దు చేసింది. కోర్టుకు వెళ్లి దానిపై గల్లా స్టే తెచ్చుకున్నారు. అయితే, ఎప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తమను టార్గెట్ చేయడం ఖాయమని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమను కాపాడలేరని గల్లా కుటుంబం భావిస్తుందని టాక్. అందుకే బీజేపీ గూటికి చేరాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో రాజధాని ఆందోళనలకు సైతం దూరంగా ఉంటున్నారని, టీడీపీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని గుసగుస వినిపిస్తోంది.