విపక్షాల నుంచి ముప్పేట విమర్శలు వస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించుకున్నారు.
ప్రతిపక్షాల గగ్గోలకు చెక్ పెడుతూ ఉచిత విద్యుత్కు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి భారం పడకుండా నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ గురువారం సమావేశమైంది. ఈ భేటీలో ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు.
జగన్ ఏం చెప్పారంటే…
శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ పథకం అమలు కానున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. “టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్తు సాధ్యం కాదన్నారు. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని ఎద్దేవా చేశారు. బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది. సుమారు 8వేల కోట్ల మేర ఉచిత విద్యుత్తు బకాయిలు పెట్టారు. విద్యుత్ కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుంది. కరెంటు బిల్లు డబ్బు అందులో నేరుగా జమ కానుంది. అదే డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించనున్నారు. దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదు’’ అని స్పష్టం చేశారు.
గొప్ప ప్రణాళికలు….
విద్యుత్ సరఫరా విషయంలో కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. “పగటిపూట 9 గంటల కరెంటు, ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు అవుతోంది. రబీ సీజన్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 10వేల మెగావాట్ల సోలార్తో పథకాన్ని మరింత గొప్పగా దీర్చిదిద్దుతాం. ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా ప్రణాళికలు రచిస్తున్నాం. ఉచిత విద్యుత్పై పేటెంట్ ఒక్క వైఎస్సార్కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు’’ అని సీఎం జగన్ తెలిపారు.
మంత్రి దమ్మున్న సవాల్
ఇప్పటికే ఆంధ్రప్రదేవ్ విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన సవాల్ చేశారు. ఉచిత విద్యుత్కు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వలే రైతులపై కాల్పులకు ఆదేశించి కన్నీరు కార్చడం తమకు చేతకాదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.