శ్రీనగర్, ఫిబ్రవరి 17: జమ్ము కాశ్మీర్లో వేర్పాటువాద నేతలకు ప్రభుత్వం తరపున కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగం ప్రకటించింది.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
మిర్వాజ్ ఉమర్ ఫరూఖ్తో పాటు అబ్దుల్ గనీ భట్, బిలాల్లోనే, హసిమ్ కురేషీ షాబిర్షాలకు ఇప్పటి వరకూ ప్రభుత్వం ఇస్తున్న అన్ని రకాల భద్రతా సౌకర్యాలను ఆదివారం సాయంత్రం నుండి రద్దు చేస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నది.
ప్రభుత్వ వాహనాలను సైతం వారి నుండి ఉపసంహరించనున్నారు.
పుల్వామా ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ శుక్రవారం శ్రీనగర్లో ఉన్నతాధికారులతో సమావేశం అయి పరిస్థితిని సమీక్షించారు. ఆ సందర్భంలో కొంత మంది పాకిస్థాన్, ఐఎస్ఐ నుంచి నిధులు పొందుతున్నారనీ, అలాంటి వారికి ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతపై పునరాలోచిస్తామని రాజ్నాధ్ ప్రకటించారు.
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో సిఆర్పిఎఫ్ జవానులు 40మంది అమరులు అయ్యారు. అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.