(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య మాదిరిగానే మరో సంఘటన హైదరాబాదులో చోటుచేసుకున్నది. మిర్యాలగూడ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచనం సృష్టించింది. తన కుమార్తే అమృత కులాంతర వివాహాం చేసుకున్నదన్న కోపంతో ఆమె తండ్రి మారుతీరావు అమృత భార్త ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే ఈ ఏడాది మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఈ ఘటనపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రాన్ని కూడా నిర్మించడంతో మరో సారి సంచలనం అయ్యింది.
మిర్యాలగూడ ఘటన మాదిరిగానే హైదరాబాదులోనూ కూతురు ప్రేమ వివాహం చేసుకున్నదన్న కోపంతో ఆమె తండ్రి ఆ యువకుడిని హత్య చేయడం సంచలనం కల్గించింది. వివరాల్లోకి వెళితే…చందానగర్ కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించాడు. హేమంత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా అవంతి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. వీరి ప్రేమకు కులాలు అడ్డుగోడలుగా నిలవడంతో అవంతి, హేమంత్ లు పెద్దలను ఎదిరించి నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వీరు గచ్చిబౌలిలోని టిఎన్ జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కుమార్తె ప్రేమ వివాహం అంగీకరించని లక్ష్మారెడ్డి ఆ యువకుడిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా మట్టుపెట్టాలని పథకాన్ని రచించిన లక్ష్మారెడ్డి తన బావ మరిది సహాయంతో గురువారం హేమంత్ ను నమ్మకంగా తీసుకువెళ్లి హత్య చేసి మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కిష్ఠాయిపాలెం శివారులో చెట్ల పొదల్లో పడేశారు. అవంతి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే కృష్టాయిపాలెం శివారులో యువకుడి మృత దేహం ఉందని తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హేమంత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాదు తరలించారు. ఈ కేసులో అవంతి తల్లిదండ్రులతో పాటు తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.