పైసలు లేనిదే ఏదీ జరగదు అన్న మాట నిజమై ఓ తండ్రి ప్రాణం తీసింది. తమ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన పసికందును చూడలేని నీస్ సహాయ స్థితి ఆ తండ్రిది. ఏది చేయాలన్నా డబ్బే కావాలన్న మాట నేడు నిజమైంది అనడానికి ఇదే నిదర్శనమైందేమో. అదే డబ్బు లేకనే ఓ తండ్రి తన కొడుకుని చూడలేని తన నిస్సహాయ స్థితికి సిగ్గు చెంది తన కొడుకుకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
పూర్తి వివరాలలోకి వెలితే.. కర్నూలు జిల్లా సి. బెళగల్కు చెందిన రాముడు, సత్యవతి దంపతుల కుమారుడు వినోద్. వినోద్ కు దేవనకొండ నెల్లుబండకు చెందిన ప్రశాంతితో నాలుగేండ్ల కిందట వివాహం జరిగింది. వీరు వ్యవసాయ కూలీలుగా జీవనం కొనసాగించేవారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రశాంతిని రెండో కాన్పు నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి వినోద్ ప్రశాంతి అమ్మతో పంపాడు.
మంగళవారం ప్రశాంతి మరో కుమారుడికి జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న వినోద్ ఆనందానికి అవదులు లేవు. కాని కొడుకు దగ్గరకు వెళ్లడానికి కూడా డబ్బులు లేని దౌర్భాగ్యం అతనికి ఎదురైంది. కొడుకు పుట్టిన సంతోషాన్ని కూడా మర్చిపోకుండా ఆ తండ్రి ఆత్మ హత్య చేసుకున్నాడు.
కొడుకు పుట్టిన సంతోషం ఒక వైపైతే తన భర్త చనిపోయిన విషాద ఘటన మరో వైపు ఆ తల్లది. కొడుకు పుట్టిన గంటకే తండ్రి మరణించడం స్థానికులను శోక సముద్రంలో ముంచింది. కుమారుడిని వెళ్లి చూడడానికి తన వద్ద డబ్బులు లేకపోవడంతో మనస్తాపంతో వినోద్ తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. అయితే వినోద్ ఆత్మహత్య విషయం ఇంకా పోలీసులకు తెలియలేదు. అతని ఆత్మహత్యకు కారణాలు డబ్బు లేకపోవడమా.. లేక మరేదైనా ఉందా అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది.