ప్రతిపక్ష టీడీపీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ టార్గెట్ చేయడం కొత్త విషయం కాదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే, ఇప్పుడు ఫోకస్ మారిందని అంటున్నారు.
చంద్రబాబును కాకుండా ఆయన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చర్యల నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వచ్చింది.
బాలయ్య అల్లుడిని వదలట్లేదుగా?
బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్కు చెందిన గీతం విద్యా సంస్థల్లో అక్రమ నిర్మాణాలపై ఏపీ సర్కారు ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఇంకో షాక్ ఇచ్చారు. గీతం యూనివర్శిటి నిబంధనల ఉల్లంఘనపై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇంద్రపాల్ సింగ్కు విజయసాయి రెడ్డి లేఖ రాశారు. అదే విధంగా గీతం విద్యా సంస్థలో లోపాలపై కేంద్రమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంత్కు కూడా విజయసాయి రెడ్డి లేఖ రాశారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సభ్యుడి అటాక్ నేపథ్యంలో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.
ఒకటి కాదు రెండు ఎదురు దెబ్బలు
గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విజయసాయిరెడ్డి ఊహించని టార్గెట్ చేశారు. ఈ హోదా పొందడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. భూమి యాజమాన్య హక్కు పత్రాల సమర్పణలో వాస్తవాలు దాచారని, యూజీసీకి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ భూమిని కూడా గీతం యాజమాన్యం చూపించిందని చెప్పారు. ఫార్మసీ, మెకానికల్ విభాగాలతో పాటు సివిల్ విభాగ నిర్మాణాల్లో కొంత భాగం ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయన్నారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ప్రజలకు వివరాలను బహిర్గతం చేయాలన్న నిబంధన పాటించలేదని, గీతం భూములకు సంబంధించిన డాక్యుమెంట్ ఆధారాలను సంబంధిత అధికారులకు పొందుపరచ లేదని లేఖలో పేర్కొన్నారు. ఎఫ్ ర్యాంక్ పొందినట్టు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరులో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ల విషయంలో నిబంధనలు పాటించలేదు అని పేర్కొన్నారు. గీతం ఉద్యోగ నియామకాల్లో రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయలేదని, డీమ్డ్ టు బి యూనివర్సిటీ గా గీతం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన లేఖ ద్వారా రమేష్ పొఖ్రియాల్కు తెలిపారు.
బాలకృష్ణను ముందుగానే…
ఇప్పటికే చంద్రబాబును ఓ రేంజ్లో టార్గెట్ చేసేసిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆ పార్టీకి కొద్దోగొప్పో బలమైన నేత అనే భావన ఉన్న బాలకృష్ణను ముందే ప్యాకప్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీలోని బలమైన నేతలను సైతం తాము వదిలిపెట్టడం లేదనే సిగ్నల్స్ ఇవ్వడంలో భాగంగానే ఈ మేరకు వరుస ఎదురుదెబ్బలని చెప్తున్నారు.