కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్ అనే పేరుంది. గ్రూపు రాజకీయాలను దూరం చేయాలని పార్టీ సీనియర్లు ఎంత సూచించినా అవి అలాగే కొనసాగుతున్నాయి.
తాజాగా అలాంటి గ్రూపు రాజకీయమే బయటపడింది. అయితే , ఇందులో టార్గెట్ అయింది కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి.
విషయం ఏంటంటే…
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో రైతు పోలీకేక సభ పేరుతో ర్యాలీ చేపట్టారు. ఇందులో కాంగ్రెస్ ముఖ్య నేతలు పలువురు పాల్గొన్నారు. దేశం, రాష్ర్టంలో రైతు వెన్నుముక విరిచేందుకే వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి , మాజీ ఎంపీ వీహెచ్ మధ్య ఒకింత మాటల యుద్ధమే జరిగింది.
రేవంత్ ఏమన్నారంటే…
ఎంపీ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిర్చి రైతుల గిట్టుబాటు కోసం రైతులు పోరాడితే అరెస్ట్ చేసి రైతుల చేతులకు బేడీలు వేసి బందీపోటు దొంగలా చేసిన ఘనుడు కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. గిట్టుబాటు ధర రాకపోతే రైతులే మంట పెట్టి తగలబెట్టే పరిస్థితి దాపురించిందన్నారు. రైతు పండించిన పంటకు దళారులు ధర నిర్ణయస్తున్నారని.. కాంగ్రెస్ గిట్టుబాటు ధర చట్టం చేసిందని గుర్తుచేశారు. కల్లాల వరకే వచ్చి కార్పోరేట్ వాళ్లు కోనుగోలు చేసే పరిస్థితి ఉందన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎందుకు తీర్మాణం చేయలేదని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని… ఎవరు ఆత్మహాత్యలు చేసుకోవద్దని కోరారు. అమ్ముడు పోయేటోళ్లను ఏరివేయాలని… డిపాజిట్లు పోయిన నాయకుల పెత్తనం కాంగ్రెస్ లో ఉండదని కేంద్ర పార్టీ చెప్పిందన్నారు. ఖమ్మం జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని…కేటిఆర్, కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశపడి కొందరు నాయకులు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వీహెచ్ వెంటనే…
అయితే ఇదే సభలో పీసీసీ మాజీ ఛీఫ్ వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవిని బడుగు బలహీన వర్గాల వారికీ ఇవ్వాలని, అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లగలుగుతుందని అన్నారు. వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సభలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. రేవంత్ కు అనుకూలంగా సభలో నినాదాలు చేస్తున్నా, వీహెచ్ వెనక్కి తగ్గలేదు. బడుగు బలహీన వర్గాలవారికి అధ్యక్ష పదవిని ఇస్తేనే రాష్ట్రంలో పార్టీ బతికి బట్టకడుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వొద్దని, పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వీహెచ్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ఐక్యతను చాటే సభలో ఆ పార్టీ అనైక్యత స్పష్టమైందని పలువురు అంటుంటే… అదే సభలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారని ఇంకొందరు చర్చించుకుంటున్నారు.