ఇప్పుడు దేశం అందరి చూపు ఉన్న సమస్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పరువు సమస్య . కోట్లాది మందికి బతుకు సమస్య. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ . ఇదంతా రైతుల సమస్యలు, ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన.
రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. నేడు జరిగే చర్చలపైనే అందరి చూపు పడింది.
అసలేం జరిగింది?
కొత్త చట్టాలను ఉపసంహరించాలని కోరుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. అయితే, అవి విఫలం అయ్యాయి. చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు మరింత సంఘటిత మయ్యాయి. ఆందోళన ఉధృతం చేయాలనే యోచనలో రైతు సంఘాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఢిల్లీ ప్రవేశ రహదారుల దిగ్బంధం చేశారు. ఆందోళన చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతూ పోతుంది. తదుపరి అనుసరించాల్సిన వ్యూహం పై ఢిల్లీ సరిహద్దుల్లోనే సమావేశమై రైతు సంఘాల నేతలు సమాలోచనలు చేస్తున్నారు.
నేడే కీలకం
రైతుల ఆందోళనలు పెరుగుతున్న తరునంలో నేడు మరోసారి చర్చలు జరగనున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వినియోగదారులు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశం అయ్యారు. ప్రతిష్టంభనను తొలగించేందుకు ఉన్న పరిష్కార మార్గాల పై కేంద్ర మంత్రుల సమాలోచనలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, మోదీ ప్రభుత్వం మనసు మార్చుకుని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చల పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా….మనకు రోజూ కడుపులో ముద్ద దిగేందుకు కారణమైన రైతు కంట కన్నీరు మంచిది కాదు. ఆ రైతు సంతోషంగా ఉండాలి . ఉండాల్సిందే . దీనికి మీరు ఏమంటారు?