ఎన్నికల్లో ఎన్నెన్నో చిత్రాలు, విచిత్రాలు కనబడుతుంటాయి. గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటూ తాను కాబట్టే గెలిచాను, మరెవరైనా ఐతే ప్రత్యర్థి చేతిలో ఓడిపోయేవారు అంటూ ఉంటారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు మాత్రం ఓటమికి పోస్ట్ మార్టం చేసుకుంటూ వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, పార్టీ మీద వ్యతిరేక ఉంది తదితర సవాలక్ష కారణాలు చెబుతుంటారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఓటమికి కారణం తెలిస్తే ఎవరైనా అయ్యో ఆలా జరిగిందా అనడం ఖాయం. ఆమె ఓటమికి పరోక్షంగా ఆమె కుమారుడు కారణం కావడం గమనార్హం. అది ఎలా జరిగిందో తెలుసుకోవాల నుకుంటున్నారా?..విషయంలోకి వస్తే..
ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ నుండి ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న 2016లో టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2018లో ఆమె భర్త రామ్ మోహన్ గౌడ్ ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సుధీర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యడు. కాగా లక్ష్మి ప్రసన్న ఈ ఎన్నికల్లో నూ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే గత ఎన్నికల నుండి లక్ష్మి ప్రసన్నకు అనుచరుడు గా ఉన్న లచ్చి రెడ్డి ఇటీవల బీజేపీలో చేరి ఆమెకు ప్రత్యర్థిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిది లక్ష్మి ప్రసన్న కుమారుడు రంజిత్ గౌడ్ తో కూడా నామినేషన్ వేయించారు. టీఆర్ఎస్ పార్టీ లక్ష్మి ప్రసన్న అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో రంజిత్ గౌడ్ నామినేషన్ విత్డ్రా చేసుకోవాలనుకున్నారు. అయితే అదనంగా పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ లను పెట్టుకోవచ్చని నామినేషన్ విత్ డ్రా చేసుకోలేదు. అదే వారి కొంప ముంచింది. రంజిత్ గౌడ్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల సంఘం టార్చర్ లైట్ గుర్తు కేటాయించింది.
అయితే ఆ డివిజన్ లోని వారి అభిమానులు అసలు ఓట్లు వేయకపోతే బాగుండదని రంజిత్ గౌడ్ కు ఓట్లు వేశారు. పోటా పోటీగా ఈ డివిజన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లచ్చి రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే లక్షి ప్రసన్న తన ప్రత్యర్థి చేతిలో కేవలం 32 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత కుమారుడు రంజిత్ గౌడ్ కి పడిన ఓట్లు చూసి నిచ్చేస్టులయ్యారు. కుమారుడికి 39 ఓట్లు పోల్ అయ్యాయి. ఆ ఓట్లు తనకు పడి ఉంటే ఏడు ఓట్ల తేడాతో అయినా గెలిచే దానిని కదా అనుకున్నారు. కుమారుడికి పడిన ఓట్ల తో తల్లి ఓడిపోవడంతో డివిజన్లో ఇది ఒక చర్చనీయాంశమైంది.