డిసెంబర్ 17న టాలీవుడ్ లో జరిగిన సందడి సినీ ప్రేమికులు అంత తేలిగ్గా మర్చిపోయేది కాదు. అగ్ర నిర్మాత దిల్ రాజు తన 50వ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్న విశేషం అది. దీంతో టాలీవుడ్ తారలంతా ఒకచోట చేరారు. హీరోలు, హీరోయిన్లు, పలువురు దర్శకులు హాజరయ్యారు. దీంతో రెండు రోజులపాటు నెట్టింట్లో సందడే సందడి. ఆ ఫొటోలన్నీ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే.. దిల్ రాజు అక్కడితో ఆగలేదు. ఆ మరునాడే మళ్లీ గోవాలో పార్టీ చేసుకున్నారు. ఇక్కడ ఇంకో సర్ ప్రైజ్ జరిగింది.
దిల్ రాజు బ్యానర్ లో పని చేసిన హీరోలు దాదాపుగా అందరూ మొన్నటి హైదరాబాద్ పార్టీలో సందడి చేశారు. అయితే.. నాని, శర్వానంద్, సిద్ధార్ధ్ వంటి హీరోలు మాత్రం మిస్ అయ్యారు. ఆ లోటుని దిల్ రాజు భర్తీ చేసేశారు. గోవాలో వీరంతా కలుసుకుని సందడి చేశారు. అక్కడే వీరంతా పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు బయటకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు వెకేషన్ కోసం గోవా వెళ్లారు. అప్పటికే అక్కడ నాని తన ఫ్యామిలీతో కలసి గోవాలో వెకేషన్ కోసం ఉన్నాడని తెలుస్తోంది. శర్వానంద్, సిద్ధార్ద్, అజయ్ భూపతి తమ ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడే ఉన్నారని తెలుస్తోంది. దీంతో వీరందరికీ గోవా కలిసొచ్చింది. సరదాగా సందడి చేశారు.
దీంతో దిల్ రాజు బర్త్ డే సంబరాలు రెండు రోజులు జరిగినట్టైంది. ఎమ్ సీఏ, నేను లోకల్ తో నాని, బొమ్మరిల్లుతో సిద్దార్ధ్, శతమానం భవతితో శర్వానంద్.. దిల్ రాజు బ్యానర్ లో హిట్లు కొట్టినవారే. దీంతో గోవా పార్టీ కూడా సంబరంగా జరిగిందని తెలుస్తోంది. మొన్నటి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్, రామ్ చరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, రామ్, నితిన్, వరుణ్ తేజ్, నాగచైతన్య, సమంత, అఖిల్, కన్నడ హీరో యాశ్, ప్రశాంత్ నీల్, నివేదా పేతురాజ్, రాశి ఖన్నా, అంజలి, అనుపమ పరమేశ్వరన్,.. ఇలా అగ్ర తారలంతా హాజరయ్యారు.