ఢిల్లీ, మార్చి 6: రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి.
రఫేల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయింది. ఒక దశలో కేసు విషయంలో న్యాయమూర్తులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. తీర్పు ఇచ్చినా.. అది రాజకీయం అవుతుందని, దీంతో దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయం జోలికి రావొద్దని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కోర్టును కోరారు.
తొలుత సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలో డిసెంబర్ 14న రఫేల్పై ఇచ్చిన తీర్పులో చాలా తప్పిదాలు ఉన్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ఎన్డిఎ ప్రభుత్వం ప్రయత్నించిందని అరోపించారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయం జోక్యంతో సహా ఇతర అంశాలు ఉన్న ఎనిమిది పేజీల రహస్య పత్రాలను కోర్టులో చదవడం ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం తరపున అటర్నీ జనరల్ కెకె వేణుగోపాల్.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి ప్రభుత్వ శాఖల నుండి దొంగిలించిన పత్రాలు, ప్రభుత్వ రహస్య చట్టాల కింద ప్రశాంత్ భూషణ్పై చర్యలు తీసుకుంటామని అన్నారు. మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరితో కలిసి ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ వేశారని, ఈ ముగ్గురు దొంగతనానికి పాల్పడి రహస్య పత్రాలు సంపాదించారని ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రివ్యూ పిటిషన్ కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ జోక్యం చేసుకుంటూ ఫిబ్రవరి ఐదున ద హిందూ పత్రికలో ఇవి వచ్చాయి, అప్పటి నుండి ప్రభుత్వం ఎమి చేసింది, ఎలాంటి చర్యలు తీసుకున్నారో కోర్టుకు నివేదించాలని మధ్యహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
లంచ్ తరువాత విచారణ ప్రారంభం కాగానే అటార్నీ జనరల్ తన వాదన కొనసాగిస్తూ దొంగిలించిన పత్రాల ఆధారంగా కోర్టు విచారణ జరపరాదని కోరారు. ఈ సమయంలో మరో న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకుంటూ దొంగ పత్రాలైనా సరే కేసుకు సంబంధించినట్లయితే కోర్టు పరిశీలిస్తుందని, దేశ భద్రత ముసుగులో కుంభకోణాలకు ఆస్కారం ఇస్తారా అని ఎదురు ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ కూడా దీన్ని సమర్థిస్తూ దొంగతనంగా సంపాదించినంత మాత్రాన సదరు పత్రం అంటరానిది ఎలా అవుతుందని అన్నారు.
కోర్టు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా..నిర్ణయం వెలువరించినా అది రాజకీయంగా మారుతుందని అది దేశ ఆస్థిరతకు దారి తీస్తుందని అటర్నీ జనరల్ అన్నారు. రహస్య పత్రాలు ప్రచురించిన ద హిందూ పత్రికతో పాటు ఎఎన్ఐ వార్త సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ లోగా ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని రహస్య పత్రాల దొంగతనం ఎలా జరిగింది, దీనిపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై రక్షణశాఖలోని సంబంధిత శాఖాధిపతి రేపటి లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేశారు.