నిజామాబాద్, మార్చి 6 : నరేంద్ర మోదీయే మళ్ళీ ప్రధాని అవుతారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్లో ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అమిత్ షా బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను ఐదేళ్లలో మోది ప్రభుత్వం చేసిందని అమిత్ షా తెలిపారు. దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిజెపి అని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే బిజెపి లక్ష్యమని, ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని అమిత్ షా అన్నారు.
రానున్న ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాదిస్తుందనీ, మోది ప్రధాని అవ్వటం ఖాయమని అమిత్ షా జోస్యం చెప్పారు. బిజెపి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు అమిత్ షా పిలుపు నిచ్చారు.
రాహుల్ గాంధీ, బీజేపీయేతర కూటమిపై అమిత్ షా ఈ సందర్బంగా విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏర్పడిన మహా కూటమిలో నాయకులే లేరని అమిత్ షా ఎద్దేవా చేశారు. వారి కూటమికి ఎజెండానే లేదనీ, రాహుల్ గాంధీ ఒక బాబా అని అమిత్ షా అభివర్ణించారు.
కాంగ్రెస్ హాయంలో ఎంతో మంది జవాన్లు దేశం కోసం మరణించినా వారిని పట్టించుకోలేదని అమిత్ షా ఆరోపించారు. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఎయిర్ స్ట్రైక్స్ తో సమాధానం చెప్పామని అమిత్ షా అన్నారు.
దాడుల గురించి పాకిస్తానే ప్రశ్నించడం లేదు కానీ రాహుల్ గాంధీ మాత్రం వాటికి ఆధారాలు చూపించాలని అడుగుతున్నారని అమిత్ షా విమర్శించారు.
రాహుల్ గాంధీ లాంటి నేతలకు పాకిస్తాన్, చైనా లాంటి దేశాలను ఎదుర్కోవడం చేతకాదని ఎద్దేవా చేశారు. కేవలం మోది లాంటి నేతలే ధీటుగా సమాధానం ఇవ్వగలరని వ్యాఖ్యానించార
ఉగ్రవాదం దేశం నుండి పోవాలంటే మరోసారి మోది రావాలని అమిత్ షా అన్నారు. మహ కూటమి అధికారంలోకి వస్తే రోజుకో పార్టీ నాయకుడు ప్రధాని అవుతారని అమిత్ షా ఎద్దేవా చేశారు.