జానక్యాహః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః’ అన్న శ్లోకం చూచాయగా నన్నా తెలియని తెలుగువారుండరు.ఎందుకంటే పెళ్లి శుభలేఖ లన్నిటినీ దీంతోనే ప్రారంభించటం అనేది బాగా నాటుకు పోయిన తెలుగు సంప్రదాయం. తమ పిల్లల వివాహ సందర్భం లో తెలుగువారు ఆదర్శదంపతులైన సీతారాములను ఈ శ్లోకం ద్వారా మొదట తలచుకొని , శుభకార్యానికి శుభారంభం చేసుకొంటారు.
ఈ శ్లోకం సీతారాముల కళ్యాణం లో తలంబ్రాలు పోసుకొనే ఘట్టాన్ని వర్ణించి, ఆ తలంబ్రాలు మీకు శుభాలు కలింగించుగాక అని ప్రార్థిస్తారు.
జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
వ్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయి తాః
స్రస్తాఃశ్యామలకాయ కాంతికకలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః
ఇప్పుడు దీని అర్ధం తెలుసుకుందాం…
పెళ్లి కూతురు గా సీతమ్మ తల్లి , పెళ్లికొడుకైనా రామయ్య తల మీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట. ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో ఉన్నంత సేపు ఎర్రని పద్మరాగమణుల్లా మెరిసాయట. సీత ఆ ముత్యాలనురామ మస్తకం మీద ఉంచినప్పుడు ఆయన నల్లని కేశజాలం మీద అవి మల్లెపూల లాగా ఒప్పారాయట. ఆ తర్వాత ఆయన తల మీది నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన శరీరకాంతితో కలిసి ఇంద్రనీలమణుల లాగా కనిపించాయట. అలాంటి సీత రామకళ్యాణ సందర్భపు ముత్యాల తలంబ్రాలు మీకందరికీ శుభం కలగ జేయు గాక అని కవి ప్రార్థన అని అంటారు .
ఇంత అద్భుతమైన, సుందరమైన, ఉదాత్తమైన భావం గల శ్లోకం కాబట్టే పెద్దలు దీనిని ప్రతి వివాహసమయం లోనూ స్మరించే లా ఉత్తమ సంప్రదాయం నెలకొల్పారు.ఈ శ్లోకం అర్థం అంతా తెలిసినా, తెలియక పోయినాఇప్పటికి ఈ సంప్రదాయం పాటిస్తున్నాం.ఇప్పుడు అర్ధం తెలిసింది కాబట్టి మరింత భక్తితో ఈ సాంప్రదాయం పాటిద్దాం.