ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంతటి వ్యక్తి ఏమిటి ఆలయ చైర్మన్ అనుకుంటున్నారా అవును, అది నిజం. ఆ ఆలయానికి ఆ ఖ్యాతి ఉంది. ప్రఖ్యాత ఆలయాలలో ఒకటైన సోమనాధ్ దేవాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ మోడీ ఆ ఆలయ ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా ఉన్నారు. తాజాగా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ చైర్మన్ గా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ట్రస్ట్ చైర్మన్ గా 16 ఏళ్లు కేశూభాయ్ పటేల్
ఇటీవల కాలం వరకూ ఆ ఆలయ చైర్మన్ గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణానంతరం ఆలయ ట్రస్ట్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. 2004 నుండి 2020 వరకూ 16 ఏళ్ల పాటు కేశూభాయ్ పటేల్ చైర్మన్ గా ఉన్నారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలో ఉన్నప్పటికీ నరేంద్ర మోడి ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశాలకు సభ్యుడి హోదా లో హజరు అవుతూ ఉండేవారు.
ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రముఖులే
ప్రస్తుతం ఆలయ ధర్మకర్తల మండలిలో మోడీతో పాటు సభ్యులుగా బీజెపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ కు చెందిన పండితుడు జేడి పర్మార్, వ్యాపారవేత్త హర్షవర్థన్ నియాటియా తదితరులు ఉన్నారు. కేశూభాయ్ పటేల్ మరణంతో ఖాళీగా ఉన్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పేరును అమిత్ షా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి మోడిని చైర్మన్గా ఎన్నుకున్నారు.
మురార్జీ దేశాయ్ తరువాత మోడీ
మాజీ ప్రధాన మంత్రి మురార్జీ దేశాయ్ తరువాత ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా నియమితులైన రెండవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. సోమనాధ్ ఆలయ ట్రస్ట్ కు 8 వ చైర్మన్ గా నరేంద్ర మోడి వ్యవహరించనున్నారు.
ఇది కూడా చదవండి..భారత ప్రధాని మోడీ కి మరో అరుదైన గౌరవం..జీ – 7 భేటీకి ఆహ్వానం