Nimmagadda Ramesh Kumar : సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టి సారించారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రభుత్వమూ ప్రకటించింది. అయితే ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని ఎస్ఈసీ తప్పుబట్టింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాగైనా బదిలీ వేటు వేస్తారని భావించిన ప్రభుత్వం ముందుగానే వారిని బదిలీ చేయాలని నిర్ణయాన్ని తీసుకుంది.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో మా ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ట్రాన్ఫ్ఫర్ అయ్యారు, ఇంకా ఎంత మందిని ఆయన (ఎస్ఈసీ) చేసుకున్నా పట్టించుకోము అని వ్యాఖ్యానించారు. దీంతో అందరూ ఈ ఇద్దరు ఉన్నతాధికారులను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాల మేరకే ప్రభుత్వం బదిలీ చేసిందని అనుకున్నారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలోనూ పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు సహకరించకపోవడం వల్లనే 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆ తరువాత ఆయన ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కు ఈ ఇద్దరు అధికారులు గైర్హజరు అయ్యారు. ఈ పరిణామాల క్రమంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ ఇద్దరు అధికారులకు కూడా ఎస్ఈసీ బదిలీ చేస్తుందని అధికార వర్గాల్లో ఊహగానాలు వచ్చాయి. ఇటీవలే ఎన్నికల సంఘం కార్యదర్శి వాణి మోహన్ ను ఎస్ఈసీ తప్పించిన విషయం తెలిసిందే.
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆ ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ యే తిరస్కరించడం. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు తగవని ఎస్ఈసీ పేర్కొనడం గమనార్హం. ఒక వేళ అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తే ఎన్నికల విధి విధానాలు పాటించాలని ఎస్ఈసీ సూచించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరుణంలో ముఖ్యమైన ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీ సరైన చర్య కాదనీ, కొత్తగా వచ్చిన అధికారులకు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఎస్ఈసీ స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల విధులకు సహకరించని అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని గతంలో హెచ్చరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆశ్చర్యకరంగా ఈ ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీలు అవసరం లేదని ప్రభుత్వానికి ఎస్ఈసీ పేర్కొనడంపై సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.