న్యూఢిల్లీ: కాంగ్రెస్ సంస్కృతి మొత్తం గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బాపూజీ నిర్వహించిన 1930 నాటి దండియాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఆయనో బ్లాగ్ రాశారు. తన సొంత రాష్ట్రం గుజరాత్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పెడుతున్నరోజే ఆయనీ విమర్శలు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలన్నది బాపూజీ ఉద్దేశమని నరేంద్రమోదీ అన్నారు. దండియాత్ర మొత్తానికి ప్రణాళిక రచించినది ‘ద గ్రేట్ సర్దార్ పటేల్’ అంటూ ఆయన తన వ్యాసం ప్రారంభించారు. అసమానతలు, కులపరమైన విభజనలను తాను నమ్మబోనని గాంధీజీ పలు సందర్భాల్లో చెప్పారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సమాజాన్ని విడదీయడానికి ఏనాడూ వెనుకాడలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే మతఘర్షణలు, దళితుల హత్యాకాండ జరిగాయని అన్నారు. వ్యాసంలోని ప్రతి సందర్భంలోనూ గాంధీ ఆలోచనలు, కాంగ్రెస్ సంస్కృతి గురించే పోల్చి చెప్పారు.
కాంగ్రెస్ సంస్కృతి గురించి గాంధీజీకి బాగా తెలుసని, అందుకే 1947 తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దుచేయాలని ఆయన అనుకున్నారని గుర్తుచేశారు. అవినీతి, దుష్పరిపాలన కలిసే ఉంటాయని గాంధీ అనేవారని, అందుకే అవినీతిపరులను శిక్షించడానికి తాము అన్నీ చేశామని మోదీ చెప్పారు. అవినీతి, కాంగ్రెస్ పర్యాయపదాలుగా మారిపోయాయన్నారు. ఏ రంగంలో చూసినా కాంగ్రెస్ అవినీతి కనపడుతుందన్నారు. రక్షణ, టెలికం, నీటిపారుదల, క్రీడలు, వ్యవసాయం.. ఇలా పలు రంగాలను ఉదహరించారు.
కాంగ్రెస్ నేతలు తమ సొంత బ్యాంకు ఖాతాలు నింపుకొని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు. పేదలకు మాత్రం కనీస అవసరాలు కూడా తీర్చలేదన్నారు. వారసత్వ రాజకీయాలను బాపూజీ తిరస్కరిస్తే, కాంగ్రెస్ మాత్రం పెంచి పోషించిందని చెప్పారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని కూడా మోదీ ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో బలవంతులు, బలహీనులకు సమాన అవకాశాలుంటాయని బాపూ చెప్పేవారన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఎమర్జెన్సీ విధించిందని అన్నారు. రాజ్యాంగంలోని 356వ అధికరణను అనేకసార్లు దుర్వినియోగం చేశారన్నారు. నాయకులు నచ్చకపోతే ప్రభుత్వాన్ని మార్చేసేవారని, ఎప్పుడూ వారసత్వ సంస్కృతినే ప్రోత్సహించారని విమర్శించారు. తమ ప్రభుత్వం బాపూ బాటలో నడుస్తోందని, కాంగ్రెస్ సంస్కృతి నుంచి భారతదేశానికి విముక్తి కల్పిస్తామని అంటూ బ్లాగ్ ముగించారు.