Jamili Elections: జమిలీ ఎన్నికలు Jamili Elections: కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న జిమిలీ ఎన్నికల అంశానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. ఈమేరకు నివేదికను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. జమిలీ ఎన్నికల వల్ల ప్రయోజనాలే ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ ఖజానాపై భారం పడటం తగ్గుతుందని.. రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడింది. జమిలీ కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన జమిలి ఎన్నికల అంశాన్ని ప్రధాని మోదీ వార్తల్లో నిలిపారు. కొన్నాళ్లు ఈ అంశం చర్చనీయాంశమైంది.
ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఏపీలో టీడీపీ తరహాలో కొన్ని పార్టీలు మాత్రమే జమిలీ ఎన్నికల కోసం తాపత్రయపడ్డాయి. ఆమధ్య జమిలీ ఎన్నికల వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ‘వన్ కంట్రీ- వన్ నేషన్’ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధమే’ అని ప్రకటించింది. ఆ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల అంశం పక్కకు వెళ్లినట్టయింది. కానీ.. ఇప్పుడు జమిలీ వల్ల ప్రయోజనాలే ఎక్కువని పార్లమెంటరీ కమిటీ అమోదం తెలిపింది. అయితే.. ఎన్నికల నిర్వహణే సులభం అని చెప్పింది కానీ.. ప్రతికూల అంశాలు వస్తే ఏం చేయాలో మాత్రం తెలపలేదు. మధ్యంతర ఎన్నికలు వస్తే ఏం చేయాలనేది ఓ ప్రశ్నగా ఉంది.
గతంలో ఒక్క ఓటు తేడాతో కేంద్ర ప్రభుత్వమే కూలిపోయి మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వాలు ఒక్కోసారి రద్దవుతూ ఉంటాయి. రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా.. కేవలం జమిలీ వల్ల ఉపయోగం మాత్రం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు అంగీకరించి, రాజ్యాంగ సవరణ జరిగి, పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది.. జమిలీ ఎన్నికలు జరగాలి. ఒకవేళ వచ్చే ఏడాదైనా జమిలీకి బీజం పడి 2022లో ఎన్నికలు వస్తే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే. మరి.. జమిలీపై ఏం నిర్ణయమవుతుదో వేచి చూడాల్సిందే.