YS Bharati: ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. అధికార విపక్షాలు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఓ సీనియర్ నేత చేసిన వ్యాఖ్య చర్చనీయాంశం అయింది. అదే సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు కామెంట్లు చేసేందుకు కారణంగా కూడా మారింది. ఇదే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు ఎపిసోడ్. దానిపై బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు.
వింత పాలన అంటూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత ప్రభుత్వం ఉంది.. వింతైన సీఎం వున్నారు.. ఇక్కడ అప్రకటిత నియంత పాలన జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో ఉందా ? లేక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉందా? అనే అనుమానం కలుగుతోందని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై దాడి ఆరోపణలు నిజమని తేలితే అంత కంటే హేయమైన చర్య మరొకటి ఉండదన్న ఆయన రఘురామ కృష్ణం రాజుపై దాడి నిర్ధారణ అయితే అది పార్లమెంట్ పై దాడిగానే పరిగణించాలని డిమాండ్ చేశారు.
కోవిడ్ లో ఫెయిల్ అయినందుకు…
కోవిడ్ నియంత్రణలో విఫలమైన జగన్ ముఖ్యమంత్రి బాధ్యతలు నుంచి తప్పుకుని ఆయన భార్యకు కానీ ఇతరులకు కానీ బాధ్యతలు అప్పగించాలని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. కక్ష సాధింపు చర్యలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు మినహాయింపు కాదని రఘురామ కృష్ణంరాజు అరెస్ట్, తర్వాత పరిణామాలు హెచ్చరికాగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు భయ భ్రాంతులు కాకుండా ఉండాలంటే శనివారం, ఆదివారం కోర్టులు తెరిచి ఉంచాలి అని సైతం విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.