Wife Return to Home after Funerals: ఈ ఫోటోలో కనిపిస్తున్నామె పేరు ముత్యాల గిరిజమ్మ, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని కొలిమిబజారు ఆమెది. గత నెల ఆమెకు కరోనా సోకింది. కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే 15వ తేదీన ఆసుపత్రి నుండి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. గిరిజమ్మ చనిపోయింది. మృతదేహాం తీసుకువెళ్లండి అని. ఆమె కుటుంబ సభ్యులు వెళ్లి ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన మృతదేహాన్ని తీసుకువచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
గత నెల 25వ తేదీన ఆమె కుమారుడు రమేష్ కూడా కరోనాతో ఖమ్మం ఆసుపత్రిలో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం గిరిజమ్మ, రమేష్ లకు కుటుంబ సభ్యులు దశదిశ కర్మలను పూర్తి చేశారు. భార్య, కుమారుడు చనిపోవడంతో గడ్డయ్య మానసిక ఆందోళనతో కుంగిపోయాడు. అయితే వారికి బుధవారం ఊహించని ఘటన ఎదురైంది. గిరిజమ్మ తాపీగా ఆటో దిగి ఇంటికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు. ఆమె కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఇది కలా, నిజమా అన్నట్లు నిర్ఘాంతపోయారు. 15 రోజుల క్రితం చనిపోయింది అనుకొని ఖర్మకాండలు పూర్తి అయిన ఆమె ఇంటికి రావడం ఏమిటని. తనకు కరోనా తగ్గిపోవడంతో ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి వచ్చానని గిరిజమ్మ చెప్పడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గిరిజమ్మను చూసేందుకు చుట్టపక్కల వారంతా ఆమె ఇంటికి చేరుకుని పరామర్శించారు.
అయితే ఆసుపత్రి సిబ్బంది చేసిన నిర్వాకానికి మండిపడుతున్నారు. ఎవరు చనిపోయారో నిర్ధారించుకోకుండా మరొకరి శవాన్ని తమకు అప్పగించి మానసిక క్షోభకు గురి చేశారని ఆమె భర్త గడ్డయ్య మండిపడుతున్నారు. గిరిజమ్మ క్షేమంగా ఇంటికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కుమారుడు కరోనాతో చనిపోవడంతో దంపతులు ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు.