EX Union Minister: కేంద్ర మాజీమంత్రి, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత బలరాం నాయక్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.మూడేళ్లపాటు ఆయన ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.2019 లోకసభ ఎన్నికల్లో ఆయన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు నిర్ణీత వ్యవధిలో ఆయన తన ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను సమర్పించలేదు.ఈ విషయమై బలరాంనాయక్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన నుండి సరైన సమాధానం రాలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు జూన్ పదోతేదీని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా దాన్ని 18 వ తేదీన తెలంగాణ గెజిట్లో ప్రచురించారు.
ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే!
బలరాంనాయక్ కు ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించడానికి తగిన సమయం, అవకాశం ఎన్నికల సంఘం ఇచ్చిందని,అయినా ఆయన ఆ వివరాలను తమకు ఇవ్వలేదని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఇలా ఆయన చేయడానికి గల కారణాలు సమర్థనీయంగా లేవని,ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.తమ నియమ నిబంధనలు ఉల్లంఘించినందున బలరాంనాయక్ మూడేళ్లపాటు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అర్హులు కారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో నాయక్ మూడేళ్లపాటు పార్లమెంట్ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయారు.
అన్ని వివరాలు ఇచ్చానంటున్న బలరాంనాయక్
అయితే తాను ఎన్నికల సంఘానికి తన ఎన్నికల వ్యయానికి సంబంధించిన అన్ని వివరాలు ఇచ్చానని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.తనపై అనర్హతను విధించడాన్ని ఆయన ఖండించారు
తన వద్ద ఉన్న వివరాలన్నింటిని సాక్ష్యాధారాలతో సహా మళ్లీ ఎన్నికల సంఘానికి అందజేస్తానని, అవసరమైతే న్యాయ పోరాటం సాగిస్తానని బలరాంనాయక్ చెప్పినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది.2009 లో యూపీఏ2 హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో బలరాంనాయక్ మంత్రిగా పనిచేశారు.అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోతూ వస్తున్నారు.ఇప్పుడు ఆయనపై అనర్హత వేటు పడటం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.