Paruchuri Malik hunger strike: ప్రముఖ కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్ మెడికల్ మాఫీయా దాడులను నిరసిస్తూ విశాఖలోని తన నివాసం వద్ద నిరహార దీక్షకు కూర్చున్నారు. కోవిడ్ నియంత్రణ విషయంలో అనుసరిస్తున్న విధానాలపై ఆయన గత కొంత కాలంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కోవి కేర్ గ్రూపు ద్వారా గ్రూపు సభ్యులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ తరుణంలోనూ కరోనా థర్డ్ వేవ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే గత నెల ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మల్లిక్ ను ఇంటర్వ్యూ చేశారు. అయితే మల్లిక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు .. మల్లిక్ చెబుతున్నవన్నీ అబద్దాలనీ, మళ్లీ ప్రజల్లో భయం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (అంటు వ్యాధుల చట్టం) కింద సుల్తాన్ బజారు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
ఇదిలా ఉండగా తనపై మెడికల్ మాఫియా ఆర్గనైడ్జ్ అటాక్ చేస్తుందని మల్లిక్ ఆరోపిస్తూ ఆందోళనకు సిద్ధపడ్డారు. వాట్సాఫ్ గ్రూపులను బ్లాక్ చేయడం, వాలంటీర్లకు ఫోన్ చేసి బెదిరించడం, సోషల్ మీడియా ద్వారా కూడా తన వాయిస్ ప్రజలకు చేరకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలకు మంచి చేయడం కోసం కూడా ఇంతగా పోరాడాలా ? అని ప్రశ్నించారు. ఈ అణచివేత అగాలి, మెడికల్ మాఫీ నుండి అటాక్ లు జరగకుండా రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరహార దీక్ష చేపట్టారు.