TRS MLA Sudheer Reddy: రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఒక్కోసారి ప్రత్యర్ధులపై నిరాధార ఆరోపణలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రత్యర్ధులు వాటిని సీరియస్ గా తీసుకుంటుంటారు. అదే విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణల కారణంగా లీగల్ నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల తెలంగాణ పీసీసీ చీఫ్ గా మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి నియామకం జరిగిన విషయం తెలిసిందే. టీ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియమితులైన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కార్యకర్తలు రాళ్లతో కొట్టాలనీ, వారి శాసనసభ్యత్వాల రద్దుకు న్యాయపోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
Read More: AP Finance ministry: రూ.41వేల కోట్ల లేక్కల తేడా ఆరోపణపై ఏపి ఆర్ధిక శాఖ వివరణ ఇదీ..!!
ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్లో విలీనం అయిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ నెల 3వ తేదీన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి నియామకం విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. మాణిక్యం ఠాగూర్ కు రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. తాము రాజ్యంగ పరంగానే టీఆర్ఎస్ లో విలీనమైనట్లు సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాణిక్యం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసు పంపించారు మాణిక్యం ఠాగూర్. దీనిపై సుధీర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.