ఫలానా మతం వారే ఉగ్రవాదులు. ఫలానా మతం వారు సాధు జంతువులు. ఫలానా మతం వారు ఉగ్ర దాడుల ఆరోపణల మీద పట్టుబడినా వారి మీద దర్యాప్తు జరిపిన ఫలానా సంస్థ ఫలానా రుజువులు చూపించలేక విఫలమవుతుంది. ఆ కారణం పునాదిగా ఫలానా కోర్టు వారు ఫలానా రోజున ఫలానా నిందితుడు, నిందితుడు కాదని నొక్కి వక్కాణిస్తుంది. తత్ పశ్చాత్ ఫలానా ఆరోపణలతో బందీ కాబడిన ఫలానా వ్యక్తి అసీమానందంతో బయటకొస్తాడు. అన్నట్టు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అసీమానంద స్వామి వారి గురించే.
కొన్నిసార్లు సందేహాలు కూడా భయావహంగానే వుంటాయి. ఎందుకంటే సందేహించే స్వాతంత్ర్యానికి సంకెళ్ళు పడ్డ కాలం కాబట్టి. 2007నాటి సమ్ఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ళ కేసులో స్వామి వారు నిందితులు. 2010, 2011లో కోర్టు విచారణ సందర్భల్లో స్వామివారే నేరాన్ని అంగీకరించినట్టు వార్తలు చదువుకున్నాం. మక్కామసీదు, అజ్మేర్ షరీఫ్ పేలుళ్ళ కేసుల్లో కూడా స్వామీజీ నిందితుడే. కానీ ఆ రెండు కేసుల్లోనూ నిర్దోషిగా ఇంతకు ముందే బయటపడ్డారు. ఇప్పుడు ఈ కేసులో కూడా కోర్టు వారు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ.) తగిన రుజువులు చూపించలేకపోయిందని చెప్తూ అసీమానందను నిర్దోషిగా ప్రకటించింది. స్వామివారు చిన్మయంగా చిద్విలాసంగా కేసు నుంచి తప్పించుకున్నారు.
కోర్టు తీర్పును సందేహించలేం. కానీ కోర్టు ముందున్న సాక్ష్యాధారాలే పలువురి సందేహాలకు పునాదులయ్యాయి. ఎన్.ఐ.ఏ. నిజాయితీ ఇప్పుడు బోనులో నిలబడినట్టు అనిపిస్తోంది. సమ్ఝౌతా కేసులో ఒక్కరూ నిందితులు కాదని కోర్టు తేల్చి చెప్పేసింది. ఈ కేసులో స్వామి అసీమానంద ప్రథమ ముద్దాయి. అదేమిటోగాని హిందుత్వ టెర్రర్ అని కొందరు పిలిచే కేసుల్లో మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ శిక్షలు పడలేదు. అదేమిటో అని సందేహించడానికి కూడా వెన్నులో వణుకు పుట్టేంత భయం కలుగుతుంది. ఎన్.ఐ.ఏ. దర్యాప్తు సంస్థ రుజువులు చూపించడంలో ఘోరంగా విఫలమవుతోంది. ఫలానా కేసుల్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది? ఫలానా కేసుల్లో ఎందుకు జరగదు? అని అనుమానాలు వ్యక్తం చేయడానిక్కూడా ఇప్పుడు పెద్ద సాహసమే చేయాలి. 2006, 2008లో మాలేగావ్ పేలుళ్ళు జరిగాయి. 2007లో సమ్ఝౌతా ఎక్స్ ప్రెస్, మక్కామసీదు,అజ్మేర్ షరీఫ్ పేలుళ్ళు జరిగాయి. ఏ కేసులోనూ ఒక్కరూ నిందితులుగా ఏ ఒక్క దర్యాప్తులోనూ తేలలేదంటే కొంచెం ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనుమానం కలగక మానదు కదా! అదిగో అలా అనుమాన పడితే సాక్షాత్తూ కోర్టులను, దర్యాప్తుసంఘాలనూ వాటి నిజాయితీలనూ శంకిస్తున్నట్టు కొరడా పట్టుకుని కొందరు విరుచుకుపడతారు.
బహుశా ఫలానా మతం ఏలుబడిలో ఉన్న దేశంలో ఫలానా ఫలానా కేసులన్నీ ఇలానే ఇలానే ముగుస్తాయేమో! సమ్ ఝౌతా పేలుళ్ళ కేసును మొదటి మూడేళ్ళపాటు దర్యాప్తు చేసిన ఒక హర్యానా పోలీసు అధికారి ఇప్పటికీ సాక్ష్యాలు బలంగా వున్నాయని వాదిస్తున్నారట. మరి ఆయన మాటలు వినేవాళ్ళెవరు? 2011లో ఈ పేలుళ్ళ కేసుల్ని ఎన్.ఐ.ఏ. చేతుల్లో పెట్టాక వరసగా దోషులు నిర్దోషులయ్యారు. చాలా మందికి బెయిలొచ్చింది. కేసులన్నీ నీరుగారడం ఎలాగో దేశానికి తెలిసొచ్చింది.
ఇంత దేనికి, ఒక్క అసీమానంద వ్యవహారమే చూద్దాం. ఆయనే స్వయంగా కోర్టులో నేరాన్ని అంగీకరించినట్టు వార్తలున్నాయి. అవన్నీ తనను హింసపెట్టడం వల్ల చెప్పానని తర్వాత చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన కారవాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు చూస్తే చాలా భయానకంగా వున్నాయి. కోర్టులో చెప్పింది అంతా అబద్ధమని..తాను ఈ హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడడం చాలా గర్వంగా వుందని చెప్పుకున్నారు. అదే పత్రిక కథనంలో తాము ముస్లింలే లక్ష్యంగా సాగించిన దాడులకు ఆరెస్సెస్ నాయకులు మోహన్ భగత్, ఇంద్రేష్ కుమార్ల ఆశీస్సులు పుష్కలంగా వున్నట్టు స్వామీజీ తెలిపారు. ఇవన్నీ చూశాక కూడా సందేహాలకు తావివ్వరాదని ఎవరైనా అంటే అసలు సత్యం అనేది ఒకటి వుందా అన్న పెను సందేహం కలగక మానదు.
మరో విచిత్రమైన వార్త ఏమంటే ఈ కేసుల్లో వాదించిన ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నేరుగా దర్యాప్తు సంఘం నిజాయితీనే ప్రశ్నించారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి బహిరంగంగా చెప్పిన మాట వింటే ప్రజాస్వామ్యం బతికే వుంటే దాని తల వెయ్యి ముక్కలవుతుంది. 2014 లో ఎన్.డి.ఏ. అధికారంలోకి వచ్చాక శాఫ్రాన్ టెర్రర్ కేసుల పట్ల కాస్త మెతక వైఖరితో పొమ్మని నేరుగా తనకు సలహాలు అందాయని ఆమె చెప్పారు. ప్రఖ్యాత సాధ్వి ప్రజ్ఞ ఎలా ఈ కేసుల నుంచి బయటపడ్డారు? పురోహిత్ ఎలా తప్పించుకున్నారు? ఇలాంటి అనుమానాలు ఎవరికైనా వస్తే వాటికి జవాబులు దొరకవు.
ఇదంతా చూశాక ఫలానా దేశంలో ఫలానా మతం వారికే శిక్షలు పడతాయని ఫలానా మతం వారు వీరులుగా కీర్తించబడతారని మనం అర్థం చేసుకోవాలి కాబోలు! ఇట సందేహంబులు సంచరించుటకు తావే లేదు అని పద్యాలు పాడుకోవాలేమో. ఫలానే వారు నిందితులుగా ఉన్న కేసుల్లో శిక్షలు ఎంత వేగవంతంగా అమలవుతాయో, ఫలానా వారి కేసులు అంతే వేగంగా నీరుగారిపోవడం షరా మామూలే అని సరిపెట్టుకోవాలేమో! ఏది ఏమైనా సందేహం సందేహమే. అది సత్యాన్వేషకుల దేహంలో ఒక భాగమై సలపరం పెడుతూనే వుంటుంది. కానీ ఫలానా ఫలానా వాదులకు ఈ పరిణామాలు అసీమానందాన్నిస్తాయి.
-ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ