మహిళకు రాజస్థాన్ హైకోర్టు అనుమతి
జైపూర్: తాను ప్రేమించిన వ్యక్తికి అప్పటికే పెళ్లయినా, అతడితో కలిసి వెళ్లేందుకు మహిళకు రాజస్థాన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆ మహిళను (26) ఆమె తల్లిదండ్రులు ఇంట్లో బంధించారని ఆమె ప్రియుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ అనుమతి ఇచ్చింది. మొయినుద్దీన్ అబ్బాసి అనే వ్యక్తి 2018 జూలై 23న రూపాల్ సోని అనే మహిళను రిజిస్టర్డ్ మ్యారేజ్ ద్వారా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెను తల్లిదండ్రులు దాచేశారని అతడు ఆరోపించాడు. దానిపై జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ వినీత్ కుమార్ మాథుర్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. మహిళను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది.
మార్చి 13న ఆమె విచారణకు హాజరు కాగా, పలు విభ్రాంతికర వాస్తవాలు బయటపడ్డాయి. పిటిషనర్ అబ్బాసీకి అప్పటికే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా అతడు సోనీని మతాంతర వివాహం చేసుకున్నాడు. కేసులో పరిస్థితుల సున్నితత్వం దృష్ట్యా మహిళను ఉదయ్ పూర్ లోని ప్రభుత్వ శరణాలయానికి పంపాలని కోర్టు ఆదేశించింది. తాజాగా మరోసారి విచారణ జరిగింది. కోర్టు అడిగినప్పుడు.. తాను అతడితోనే కలిసుంటానని గట్టిగా చెప్పింది. ఇందులో ఏం ఇబ్బందులున్నా తానే చూసుకుంటానంది. ఆమె మేజర్ కావడం, తగిన నిర్ణయాలు తీసుకోగల వయసు ఉండటంతో అతడితో వెళ్లేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. ఆమె ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉండచ్చని స్పష్టం చేసింది.