TDP MP Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారనీ, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇంతకు ముందే ప్రచారం జరిగింది. ఆయన సిమ్లాలో ఉన్న సమయంలో నాని రాజకీయ భవిష్యత్తుపై మీడియాలో కథనాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో తాను విజయవాడ నుండి పోటీ చేయడం లేదనీ, వేరే అభ్యర్థిని చూసుకోవాలని కూడా చంద్రబాబుకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా విజయవాడ కేశినేని భవన్ (నాని కార్యాలయం) లో చంద్రబాబు నాయుడు ఫోటోతో సహా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ ఇన్ చార్జీల ఫోటోలను పీకేశారనీ, ఆ ఫోటోల స్థానంలో కేశినేని నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల ఫోటోలతో పాటు రతన్ టాటా తో నాని ఉన్న ఫోటోలను ఏర్పాటు చేశారని మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చనీయాంశం అయ్యింది.
TDP MP Kesineni Nani: బీజేపీలో చేరే ఆలోచన చేస్తున్నారా..?
గత కొంత కాలంగా పార్టీ అధినేతతో, స్థానిక నేతలతో అంటీ మున్నట్లుగా వ్యవహరిస్తున్న కేశినేని నాని బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనీ, కేంద్ర బీజేపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీనియర్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే వెంటనే చంద్రబాబు అలర్ట్ అయి ఆయన వద్దకు టీడీపీ నేతల బృందాన్ని పంపించడం, ఆ తరువాత చంద్రబాబే స్వయంగా గోరంట్లతో చర్చలు జరిపి ఆయన అలక తీర్చడం తెలిసిందే. కేశినేని పార్టీకి దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇచ్చినా పార్టీ అధినేత నుండి బుజ్జగింపులు గానీ చర్చలు గానీ జరపకపోవడంతో ఆయన చంద్రబాబు తీరుపై అసమ్మతి తో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ కేశినేని భవన్ లో ఫోటోలు పీకేసిన వ్యవహారంపై, ఆయన బీజేపీలో చేరనున్నారు అంటూ వస్తున్న వదంతులపై కేశినేని ట్విట్టర్ వేదిక గా కూడా స్పందించలేదు.
వదంతులపై స్పందించిన కేశినేని స్వేత
అయితే కేశినేని నాని కుమార్తె, విజయవాడ కార్పోరేటర్ కేశినేని స్వేత ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయవాడ లోని కేశినేని భవన్ (కార్యాలయం) ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ కెమెరా కొంచెం జూమ్ అవుట్ చేసి ఉంటే సరిపోయేది అని పేర్కొంది. ఆ ఫోటోలో గతం నుండి ఉన్న ఫోటోలు యథాతధంగా ఉన్నాయి. చంద్రబాబు, ఎన్టీఆర్, పార్టీ ఫోటోలు ఉన్నాయి. కొంచెం దూరం నుండి ఫోటో తీయడంతో కెమెరా జూమ్ అవుట్ చేసి తీస్తే సరిపోయేది అని ఆమె పెర్కొంది. మరో పక్క కేశినేని భవన్ లో చంద్రబాబు ఫోటోలు తొలగించలేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.రెండు రోజుల క్రితం నుండి కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతలు రాజీనామాల వార్తలు వెలుగులోకి రావడంతో దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేశినేని పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేశినేని అభిమానులు పేర్కొంటున్నారు. దీనిపై కేశినేని స్వేత వెంటనే స్పందించడం పట్ల ఆయన అభిమానులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.