Sonu Sood: గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయం నుండి బాధితులకు స్వచ్చందంగా సేవలు అందిస్తూ రియల్ హీరోగా, అపర ధానకర్ణుడుగా ప్రముఖ నటుడు సోనూ సూద్ ను దేశ ప్రజలు కొనియాడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సోనూ సూద్ నివాసం, కార్యాలయంపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటిఆర్ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూ సూద్ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భయపడుతుంది అన్నట్లుగా కేటిఆర్ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. సీఎం కేసిఆర్ నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నేడు కేటిఆర్ సైతం సోనూసూద్ అంశంపై పరోక్షంగా కేంద్రాన్ని విమర్శించడం గమనార్హం.
Sonu Sood: సోనూ సూద్ వెంట తామంతా
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూపు ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్ కు సన్మాన కార్యక్రం జరిగింది. ఈ కార్యక్రమంలో సోనూసూద్ తో కలిసి కేటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో ఎలాంటి స్వార్ధం లేకుండా సోనూసూద్ మానవత్వంతో సేవాభావం చాటుకున్నారన్నారు. తన పని, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని కొనియాడారు. సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం ఒక్కటే అన్ని చేయలేదని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేయడం చాలా సులభమనీ, బాధ్యతగా సేవలు చేయడం గొప్ప అని అన్నారు. సోనూసూద్ మంచి పనులు చేస్తున్నారని కొందరు అసూయపడుతున్నారన్నారు. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తారని భావించే ఐటీ, ఈడీ దాడులు చేయించారని కేటిఆర్ వ్యాఖ్యానించారు. ఐటీ దాడులు, ఈడీ సోదాలతో ఆయనను భయకంపితుడిని చేయాలనీ, ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారనీ కేటిఆర్ అన్నారు. వీటన్నింటికీ సోనూ సూద్ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సోనూ సూద్ రియల్ హీరో, ఆయన వెంట తామంతా ఉన్నామనీ, కేటిఆర్ అన్నారు. వీటన్నింటికీ సోనూ సూద్ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సోనూ సూద్ రియల్ హీరో, ఆయన వెంట తామంతా ఉన్నామనీ పేర్కొంటూ… మంచి పనులు సోనూ సూద్ చేస్తూనే ఉండాలనీ, సోనూతో కలిసి పని చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయనపై విమర్శలు చేసే వారు ఆలోచించుకోవాలని సూచించారు.
కేటిఆర్ లాంటి వాళ్లు ఉంటే తమ లాంటి వాళ్ల అవసరం ఉండదు
మంత్రి కేటిఆర్ లాంటి నేతలు ఉంటే తన లాంటి వాళ్ల అవసరం ఉండదనీ సోనూ సూద్ అన్నారు. కోవిడ్ వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సహాయ పడటమే మన ముందు ఉన్నసవాల్ అని పేర్కొన్నారు. జమ్మూ నుండి కన్యాకుమారి వరకూ సేవా కార్యక్రమాలు నిర్వహించానన్నారు. తెలంగాణ నుండే ప్రతి స్పందించే వ్యవస్థ కనిపించిందని సోనూసూద్ అన్నారు. తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. మంత్రి కేటిఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలపై సత్వరం స్పందిస్తున్న సంగతి తెలిసిందే.