Perni nani: తెలంగాణ, ఏపి మంత్రుల మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభం అయ్యింది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. ఇంతకు ముందు జల జగడం నేపథ్యంలో మాటల యుద్దం జరిగింది. ఆ వివాదం సద్దుమణగగా తాజాగా ఏపి సీఎం జగన్ పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఏపి ఆర్ధిక పరిస్థితిపై ఇంతకు ముందు తెలంగాణ సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ లు కామెంట్స్ చేయడంతో ఇప్పుడు మంత్రులు కూడా ఆ బాణీ అందుకుంటున్నారు. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపి సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ధీటుగా కౌంటర్ అటాక్ ఇచ్చారు.
ఆంధ్రావాళ్లు బిచ్చమెత్తుకుంటున్నారు
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏమన్నారంటే.. “తెలంగాణ వస్తే అడుక్కుతింటారని మనల్ని అన్నారు. కేసిఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నాం. ఇంతకు ముందు మన పైసలు ఆంద్రోళ్లు దొబ్బుకుపోయారు. ఇప్పుడు మన పైసలు అటు పోవడం లేదు. ఆంధ్రాలో జగన్మోహనరెడ్డి ఉన్నాడు, ఆయన ఇప్పుడు అడుక్కోతింటోండు. ఆంద్రావోళ్లు ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటున్నారు. రోజు గడవాలంటే కేంద్రం నుండి లోన్ లు కావాలే. లేక పోతే ఆ రాష్ట్రం నడవదు. ఆయనపై కేంద్రం ప్రెసర్ పెట్టింది. బోర్లకు మీటర్లు పెడితేనే పైసలు ఇస్తామని కేంద్రం అంటే కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఏపిలో బోర్లకు మీటర్లు పెట్టుడు స్టార్ట్ అయ్యింది” అని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Perni nani: కేసిఆర్ ఎందుకు వెళుతున్నట్లు
దీనిపై అదే రీతిలో ఏపి మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సరే మేము కేంద్రం నుండి రావాల్సిన వాటి కోసం అడుక్కోవడానికే వెళుతున్నాం, కేసిఆర్ ఏమి అడుక్కోవడానికి మాటిమాటికి ఢిల్లీకి వెళుతున్నాడో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. “చెప్పమనండి, నేను కేంద్రంలో చేరతా, మాకు కేంద్ర మంత్రులు ఇవ్వండి, మా తలుపులు తెరిచి ఉన్నాయి,. నేను రెడీగా ఉన్నా అందుకేగా, మాకు చేతకాదు ఇట్లా, ఇంటి బయట కాలర్ ఎగరేయ్యడం, ఇంట్లోకి వెళ్లి కాళ్లు పట్టుకోవడం అనేది జగన్మోహనరెడ్డి తత్వం కాదు. లోపలైనా, బయటైనా ఒకటే మాట ఉంటుంది. స్నేహం అంటే స్నేహం, ఢీ అంటే ఢీ, దోస్తీ అంటే దోస్తీ, సై అంటే సై అన్నది జగన్మోహనరెడ్డి తత్వమన్నారు. బయట కాలర్ ఎగరేసి లోపలికి వెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్ కు రాదు, హైదరాబాద్ పెద్ద పాడి కుండ. పాడికుండ లాంటి హైదరాబాద్ ఉన్నా తెలంగాణ అప్పుల పాలైంది. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు.. తెలంగాణ నేతల వైఖరి ఉంది” అని పేర్ని అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపి ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. బిచ్చమెత్తుకుంటున్నామని అనే మాటలు రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ నేతలు మాట్లాడింది వారి విచక్షణకు వదిలేస్తున్నామన్నారు. నిధుల గురించి ఒక్కో రాష్ట్రం ఒక్కోలా అడుగుతుందని, ఏపి ప్రభుత్వం గురించి తెలంగాణ మంత్రులు అక్కడ మాట్లాడటం సరికాదని అన్నారు. ఏపిలో టీడీపీ మాట్లాడిన మాటలే తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు.