కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతొన్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైసూర్ లో పాదయాత్ర చేస్తున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ప్రఖ్యాత సుత్తూర్ మఠాన్ని సందర్శించి శ్రీ శివరాత్రి దేశికేంద్ర స్వామిజీ ఆశీస్సులు స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కలిసి మఠాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ.. స్వామీజీని ఆశీస్సులు స్వీకరించారు. సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర సోమవారం 26వ రోజుకు చేరుకుంది. రాహుల్ పాదయాత్ర ఉత్సహంగా సాగుతోంది. రాహుల్ ను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు యాత్రకు తరలివస్తున్నారు. పాదయాత్రలో ప్రజలతో సాదరంగా రాహుల్ పలకరిస్తున్నారు. వారితో పోటోలు దిగుతున్నారు. కొందరు కార్యకర్తలు రాహుల్ తో సెల్ఫీలు తీసుకుని మురిసిపోతున్నారు.
రాహుల్ యాత్ర వెంట అనేక మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. రోజుకు 25 కిలో మీటర్ల వరకూ రాహుల్ యాత్ర కొనసాగుతోంది. కర్ణాటకలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొననున్నారని సమాచారం. ఆమె గురువారం యాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ప్రియాంక గాంధీ కూడా పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం. రాహుల్ పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మైసూర్ లో నిన్న జోరు వర్షంలోనూ రాహుల్ పాదయాత్ర కొనసాగించారు. వర్షంలోనే రాహుల్ ప్రసంగించారు. ఆ ప్రసంగం వీడియోను ట్వీట్టర్ ఖాతాలో పోస్టు చేసిన రాహుల్ గాంధీ .. భారత్ ను ఏకం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. దేశ గొంతుకను వినిపించే విషయంలో ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగే భారత్ జోడో యాత్రను ఎవరు ఆపలేరు అని పేర్కొన్నారు.