ఏపిలో రాజధాని అంశం రావణ కాష్టంలా కాలుతోంది. ఒక పక్క అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసి ఆధ్వర్యంలో రైతులు అరసవల్లి పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర 15వ తేదీ నాటికి విశాఖ చేరుకుంటుంది. మరో పక్క ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా అడ్డుకోవడానికే రైతుల ముసుగులో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారనీ వైసీపీ నేతలు, మంత్రులు విమర్శిస్తున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన పేరుతో జేఏసి ఆధ్వర్యంలో 15వ తేదీ భారీ ర్యాలీ చేపడుతున్నారు. ఎందుకీ గర్జన అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ట్వీట్ లు చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ లపై మంత్రులు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు సంధించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజుకుంటున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ విశాఖలో జనవాణి నిర్వహణకు ప్లాన్ చేసుకున్నారు.
ఈ నెల 15 నుండి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటనకు సిద్దమైయ్యారు. 15, 16,17 తేదీల్లో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలతో సమావేశాలు, 16వ తేదీ విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఓ పక్క మూడు రాజధానులకు అనుకూలంగా విశాఖ గర్జన నిర్వహిస్తున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ప్లాన్ చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమిటి..? పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇస్తారా.. ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గర్జన రోజే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకోవడంపై మంత్రి గుడివాడ అమరనాథ్ ఆయన పై విమర్శలు గుప్పించారు. 15వ తేదీనే విశాఖలో పవన్ కళ్యాణ్ కార్యక్రమం పెట్టుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
చంద్రబాబు పేకలో జోకర్ లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడుతున్నారని విమర్శించారు. అనేక సందర్భాల్లో ఈ విషయం రుజువు అయ్యిందన్నారు. ఏదైనా డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ముందుంటారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం పెట్టింది కేవలం డైవర్ట్ చేయడానికేనని విమర్శించారు. జనవాణి కంటే ముందు విశాఖ ప్రాంతంపై ఆయన వాణి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమరనాధ్, విశాఖ కు రాజధాని వస్తుంటే ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. 15వ తేదీన విశాఖ గర్జన జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ కార్యక్రమం పెట్టడం వెనుక ఉద్దేశం అందరికీ తెలుసునని అన్నారు. జనవాణి కార్యక్రమంలో ప్రజలు ఆయన్ను కఛ్చితంగా నిలదీస్తారని తెలిపారు. గాజువాకలో పోటీ చేస్తే ఓడించారని ఈ ప్రాంతంపై కక్ష కట్టారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను మన్నించి పవన్ కళ్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు.