“న్యాయసాధన ప్రక్రియను ఎవ్వరూ మోక్షసాధన ప్రక్రియగా పరిగణించకూడదు” అన్నాడట అయిదువందల ఏళ్ళ కిందటి షేక్స్పియర్. మర్చంట్ అఫ్ వెనిస్ నాటకానికి కథానాయిక పోర్షియా. ఆవిడ, మారువేషంలో వచ్చి కోర్టులో ఇచ్చే ఉపన్యాసం ప్రపంచ సాహిత్యంలో సుప్రసిద్ధం! ఆ ఉపన్యాసం పొడుగునా పోర్షియా కరుణ, కృప ఎంత గొప్పదో చెప్తూనే ఈ మాటలంటుంది. కానీ, ఎన్నడో అర్ధ సహస్రాబ్ది కిందట షేక్స్పియర్ రాసిన విషయాలు ఎవరికి కావాలిప్పుడు? అందుకే, న్యాయ సాధన ప్రక్రియలు ఇప్పుడు జాతీయ స్థాయిలో వోట్లసాధన ప్రక్రియలు గానూ, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య పరమైన విజయ సాధన ప్రక్రియలు గానూ మారిపోతున్నాయి.
దీనికి తాజా ఉదాహరణ, అంతర్జాతీయ కోర్టులో కులభూషణ్ జాదవ్ మరణశిక్ష కేసును చెప్పుకోవచ్చు. మనదేశ పౌరుడూ, మాజీ (నౌకాదళ) సైన్యాధికారి కులభూషణ్ యాదవ్ పై పాకిస్తాన్ గూఢచారం కేసు పెట్టింది. మన దేశానికి చెందిన -ఆ మాటకొస్తే ఏ విదేశీ – న్యాయవాదులకు ప్రవేశం లేని “కోర్టు”లో జాదవ్ పై కూలంకషంగా విచారణ జరిపించామనీ, తదనంతరం ముద్దాయికి మరణశిక్ష విధించామనీ పాకిస్తాన్ ప్రకటించింది.
పాకిస్తాన్లో ఏలుబడిలోవున్నది ఇస్లామిక్ రాజ్యం. అంతర్జాతీయ ఒప్పందాలూ, ఒడంబడికల పైన పాక్ సంతకం చేయడమూ, వాటిని పాటించకపోవడమూ అనేక సందర్భాల్లో జరిగినదే! జాదవ్ విషయంలోనూ అదే పునరావృత్తం అయింది. ఈ కేసు విషయంలో సుప్రీమ్ కోర్టు న్యాయవాది హరీష్ సాల్వే నిర్వర్తించిన కర్తవ్యం ప్రత్యేకంగా ప్రస్తావించ వలసినది. “ఈ అంతర్జాతీయ కోర్టు తీర్పు నాకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిం”దని సాల్వే ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఈ తీర్పు విషయంలో విడ్డురంగా అనిపించిన వింత ఒకటి ఉంది. తీర్పు విని అది తమ “నైతిక విజయం” అని ఒకరంటే, తమ “ధార్మిక విజయం” అని ప్రత్యర్థులు పేర్కొన్నారు. ఇరుపక్షాలనూ అంతగా మెప్పించ గలిగినందుకు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అభినందించక తప్పదు. అయితే, మహాకవి అడిగినట్లుగా “ఏది సత్యం? ఏదసత్యం? ఓ మహాత్మా, ఓ మహర్షీ!!” అని అడగక తప్పడం లేదు!.
అది అలా ఉంచితే, మన ఓవర్ యాక్టివ్ మీడియా సంస్థలు, ఈ కేసు విషయంలో కూడా యథాప్రకారం అతినటన ప్రదర్శించాయి! సరే, వాళ్ళ రాజకీయ విధానాలు, ఆయా సంస్థల వాణిజ్య ప్రయోజనాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నందువల్ల, అలా అతినటన చేయక చస్తారా? అని మనలో మనం సర్దుకోవచ్చు. కానీ మన దేశంలోనే పుట్టి, ఇక్కడే చదువుకుని, ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ కూడా చేసుకునే కుర్రాళ్ళ పైన, “రాజద్రోహం” కేసులు పెట్టి, వాళ్ళను జైళ్లలో పెట్టినప్పుడు ఈ ఓవర్ యాక్టర్స్ అందరూ ఏమైపోయారు?
కనీసం రెండుకాళ్ళపై నడవడానికి సైతం సహకరించని శరీరంతో అవస్థపడే ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్లపై నమ్మశక్యం కాని ఆరోపణలు చేసిన రోజున ఈ ఓవర్ యాక్టర్స్ అందరూ ఏమైపోయారు? సాయిబాబా శారీరక పరిమితుల గురించి ఆయన సతీమణి చేసిన విజ్ఞప్తులకు పట్టిన గతేమిటని అడగవలసిన క్షణంలో ఈ ఓవర్ యాక్టర్స్ అందరూ ఏమైపోయారు?
భోపాల్ విషవాయు దుర్మార్గంలో, ప్రధాన నిందితుడి తరఫున అత్యున్నత న్యాయస్థానాల్లో వాదించిన మహానుభావుడే, ఆ తర్వాతి రోజుల్లో మన దేశం నుదుటి గీత ఎక్కడ, ఎలా ఎంత మందాన ఉండాలో నిర్ణయించే బృహత్తర బాధ్యతను భుజాన వేసుకున్నప్పుడు ఈ ఓవర్ యాక్టర్స్ అందరూ ఏమైపోయారు?
వేలకోట్ల రూపాయల “ఋణానుబంధాన్ని” పుటుక్కున తెంచేసి విమానం ఎక్కేసిన లకుముకిపిట్టకు పార్లమెంట్ కారిడార్లోనే న్యాయ సలహా అందించిన మంత్రి “పుంగవుడి” గురించి ఈ ఓవర్ యాక్టర్స్ కిక్కురుమనరేం? నీరవ్ మోడీ, “హమారే మేహూల్ భాయ్” లాంటి వాళ్లకు ఎవరెవరి అండదండలు ఉన్నాయో, ఈ ఓవర్ యాక్టర్స్ బయట పెట్టరేం?
పాకిస్తాన్ లాగా నిస్సిగ్గుగా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళ గురించి తప్ప, మర్యాదగా, బ్రిటిష్ వలసవాదుల కాలంనాటి మానసిక ధోరణుల మాటున న్యాయం కోసం, ధర్మం కోసం గొంతెత్తే వాళ్ళ వాణిని అణచివెయ్యడం ఈ ఓవర్ యాక్టర్లకు కనపడదా?
“ఏది సత్యం? ఏదసత్యం? ఓ మహాత్మా, ఓ మహర్షీ!!”
మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ