(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉత్తరప్రదేశ్ విద్యుత్ సరఫరా విభాగం నిర్వాకం వింటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. హాపూర్ జిల్లాలోని చామ్రి గ్రామంలో నివసించే షమీమ్ అనే వ్యక్తి ఇంటి కనెక్షన్కు 128 కోట్ల రూపాయలకు పైగా బిల్లు పంపించింది. అంతటితో వారి నిర్వాకం ఆగలేదు. ఆ బిల్లు కట్టనందుకు షమీమ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
బిల్లు తీసుకుని షమీమ్ విద్యుత్ విభాగం కార్యాలయానికి వెళ్లి “పొరపాటు జరిగింది, కాస్త దీనిని సరిచేయండి” అని వేడుకున్నాడు. పొరపాటు జరిగిన మాట వాస్తవమే గానీ, ముందు బిల్లు కట్టు తర్వాత పొరపాటు సరిచేస్తాం అని విద్యుత్ విభాగం సిబ్బంది బదులిచ్చారు. 128 కోట్ల రూపాయలు కట్టడం ఏమిటి మహాప్రభో అంటూ షమీమ్ నెత్తీనోరూ కొట్టుకున్నాడు. అయినా రూలు రూలే అన్నారు ఘనత వహించిన విద్యుత్ విభాగం సిబ్బంది.
కరెంటు లేకుండా పూట గడవడం కష్టం కాబట్టి షమీమ్ కాలికి బలపం కట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇంతవరకూ ప్రయోజనం లేకపోయింది. “మా ఇంటికి మామూలుగా 700 నుంచి 800 రూపాయలు వరకూ బిల్లు వస్తుంది. ఈసారి మొత్తం హాపూర్ జిల్లా బిల్లంతా నాకే పంపినట్లున్నారు” అని షమీమ్ అన్నట్లు ఎఎన్ఐ వార్తా సంస్థ పేర్కొన్నది.
Photo Courtesy: ANI