(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదల బీభత్సం కొనసాగుతోంది. అసోంలో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చడంతో వరద ముంపులో వేలాది గ్రామాలు చిక్కుకున్నాయి. బీహార్ను సైతం వరదలు వణికిస్తున్నాయి,
అసోం, బీహార్ రాష్ట్రాల్లో 159మంది మృతి చెందారు. రెండు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా నిరాశ్రయులు అయ్యారు. అసోంలో శనివారం మరో 12మంది మృతి చెందగా ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 62కు చేరింది.
వర్షాలు తగ్గుముఖం పట్టినా బ్రహ్మపుత్ర, ధన్సిరి, జియా, భరాలి, కొపిలి నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,705 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 44లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. లక్షా మూడు వేల మంది 689 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కజిరంగ అటవీ ప్రాంతంలో 129 జంతువులు మృతి చెందాయి.
బీహార్ రాష్ట్రంలో 12 జిల్లాలు వరద ప్రవాహానికి గురయ్యాయి. ఈ రాష్ట్రంలో వరదల వల్ల శనివారం మరో ఆరుగురు మృతి చెందగా మృతుల సంఖ్య 97కు చేరింది. కేవలం సీతామడి జిల్లాలోనే అత్యధికంగా 27మంది మృతి చెందారు. బీహార్లోని నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువుల కట్టలు తెగిపోవడంతో గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలో చిక్కుకున్న వారిని ఎన్ఆర్డిఎఫ్ బృందం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.