అమరావతి: బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం బందరు పోర్టు విషయంపై పత్రికలో వచ్చిన కథనానికి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
బందరు పోర్టును ఏళ్ళ తరబడి నిర్లక్ష్యం చేస్తుంటే మచిలీపట్నం డీప్ వాటర్పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టిందనీ, అందు కోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థను 2017 మార్చిలో ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జూన్ 28, 2019న RT – 62 ‘రహస్య’ జీవోగా జారీ చేసి, రెండు రోజుల్లో ‘జారీ చేయబడలేదు’ అని మార్చారని చంద్రబాబు అన్నారు. బందరు పోర్టును తెలంగాణకు ఇస్తున్నారా? అని అసెంబ్లీలో అడిగితే లేదని బుకాయించారనీ, కానీ పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు.
‘సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరం. ఇలాంటి పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీలేదు. మీ స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే టిడిపి సహించదు.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.