అమరావతి: రాజధాని అంశం మరో ఉద్యమంగా మారే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వివాదానికి ముగింపు పలకాలని మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు తేనె తుట్టెని కదిపినట్లయిందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు గడిచిన తరువాత కూడా రాష్ట్ర రాజధానిపై చర్చ జరగడం దురదృష్టకరమని గంటా వ్యాఖ్యానించారు.
రాజధానిపై రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, సుజనా చౌదరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వివిధ రకాలుగా వ్యాఖ్యలు చేయడాన్ని గంటా తప్పుబట్టారు. బొత్సా పదేపదే రాజధానిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని గంటా అన్నారు. విజయవాడలో రాజధాని ఏర్పాటుకు స్వాగతిస్తున్నామని 2014లో జగన్ అప్పటి శాసనసభలో ప్రకటించిన విషయాన్ని గంటా గుర్తు చేస్తూ ఈ నెల నాలుగున జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజధాని వివాదానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. రాజధానిపై నేరుగా సిఎం జగన్ ప్రకటన చేయాలని గంటా కోరారు.
రాజధాని అంశంపై మరో టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపి రాజధాని అమరావతికి సాక్షాత్తు దేశప్రధాని నరేంద్ర మోది శంకుస్థాపన చేసిన కర్మభూమి అని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వేలాది ఆలయాలు, గ్రామ దేవతల పుణ్యక్షేత్రాల నుండి తీసుకువచ్చిన మట్టి, నీటితో పునీతమైన పుణ్యభూమి అని, సకల దేవతల ఆశీస్సులు అందుకున్న పవిత్ర స్థలం అని వర్ల అన్నారు. అంతటి మహిమాన్విత అమరావతిని కదిలించడం ఎవరి తరం అయినా అవుతుందా అని ప్రశ్నించారు. ఒక వేళ అమరావతిని తరలించగలం అనుకుంటే అది వారి ‘భ్రమ’ మాత్రమేనని వర్ల వ్యాఖ్యానించారు.