(న్యూస్ ఆర్బిట్ డెస్క్) :
దేశ విభజన, మూడు యుద్ధాలు, సరిహద్దులో ఉద్రిక్తతలు ..ఇవేవీ కూడా ఇంతవరకూ ఇండియా, పాకిస్థాన్ మధ్య తపాలా సంబంధాలకు ఆటంకం కల్పించలేకపోయాయి. కానీ జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం నిర్వీర్యం చేసిన తర్వాత పాకిస్థాన్ రెండు దేశాల మధ్యా తపాలా సంబంధం నిలిపివేసింది.
గత నెలా 15 రోజులుగా ఇండియా, పాకిస్థాన్ మధ్య తపాలా నడవడం లేదు. ఈ సంబంధం ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందో తెలియదని ఢిల్లీలోని పోస్టల్ సర్వీసెస్ డైరక్టర్ ఆర్.వి.చౌదరి చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొన్నది. ప్రస్తుతానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పాకిస్థాన్కు ఉద్దేశించిన పోస్టును ‘తాత్కాలిక నిలిపివేత’ క్యాటగిరీలో పెడుతున్నామని ఆయన చెప్పారు. ‘పాకిస్థాన్ ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. ఎప్పటికి నిషేధం ఎత్తివేస్తారో తెలియదు’ అని ఆయన పేర్కొన్నారు.
దేశం నలుమూలల నుంచీ విదేశాలకు పంపే పోస్టు, ప్రాంతాల వారీగా ఉన్న 28 ‘విదేశీ పోస్టాఫీసు’లకు చేరుతుంది. వాటిలో ఢిల్లీ, ముంబై నగరాల్లోని విదేశీ పోస్టాఫీసులు మాత్రమే పాకిస్థానుకు వెళ్లే తపాలా సంగతి చూస్తాయి. ఢిల్లీలోని కొట్లా మార్గ్లో ఉన్న పోస్టాఫీసు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్ రాష్టాల నుంచి పాకిస్థాన్ వెళ్లే పోస్టును సేకరించి పంపుతుంది. మిగతా రాష్ట్రాల నుంచి పాకిస్థాన్కు ఉద్దేశించిన పోస్టు ముంబైలోని విదేశీ పోస్టాఫీసు ద్వారా వెళుతుంది.
పాకిస్థాన్కు వెళ్లే పోస్టు ప్రధానంగా విద్యా, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన పుస్తకాలేననీ, కొద్దిగా మాత్రమే వ్యక్తిగత ఉత్తరాలు ఉంటాయనీ ఢిల్లీలోని కొట్లా మార్గ్ పోస్టాఫీసు సూపరింటెండెంట్ సతీష్ కుమార్ తెలిపారు. సరిహద్దుకు అటూ ఇటూ ఉన్న పంజాబ్ రాష్ట్రాలలోని సాంస్కృతిక సంఘాలు, ప్రచురణ కర్తలూ ఈ నిషేధం త్వరగా తొలగిపోతే బావుండునని ఆశిస్తున్నారు.
‘ఈ ఇంటర్నెట్ యుగంలో నిజానికి తపాలా సంబంధాల నిషేధం లెక్కలోకి రాదు. కానీ ఉత్తరాలు భావ వ్యక్తీకరణకు ఒక చక్కటి మార్గం. ఆ హక్కును రాజ్యం తొలగించడం అనేది సరైన పని కాదు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి నిషేధం వచ్చినట్లు నాకైతే గుర్తు లేదు. 1965 యుద్ధం అప్పుడూ, కార్గిల్ యుద్ధం జరిగినపుడు కూడా రెండు దేశాల మధ్యా పోస్టు ఆగలేదు’s అన్నారు జతిన్ దేశాయ్. పాకిస్థాన్, ఇండియా మధ్య శాంతి స్థాపించేందుకు కృషి చేస్తున్న పీపుల్స్ ఫోరంలో ఆయన సభ్యుడు.
Featured Photo Courtesy: Indian Express